బీహార్ అసెంబ్లీలో  నితీష్ కుమార్ ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.  విశ్వాస పరీక్ష సమయంలో విపక్షాలు  వాకౌట్ చేశాయి.

పాట్నా: బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. నితీష్ కుమార్ కు అనుకూలంగా 129 ఓట్లు వచ్చాయి.మహాకూటమికి రెండు వారాల క్రితం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. బీజేపీ మద్దతుతో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.

బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సమయంలో ముగ్గరు రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యేలు ప్రహ్లాడ్ యాదవ్, నీలందేవి, చేతన్ ఆనంద్ లు ఎన్‌డీఏ కూటమికి మారారు.బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల్లో 129 మంది నితీష్ కుమార్ కు మద్దతు పలికారు. విశ్వాస పరీక్ష సమయంలో ఆర్‌జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమి వాకౌట్ చేసింది. 

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు.అయితే మ్యాజిక్ ఫిగర్ కు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీ(యూ)కు 45 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆర్‌జేడీకి 79 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. లెఫ్ట్ ఫ్రంట్ కు 16 మంది ఎమ్మెల్యేలున్నారు. 

బీహార్ అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ సభ్యుల బెంచీలో కూర్చోవడంపై ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. బీహార్ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్‌డీఏ కూటమి వైపునకు వెళ్లారు.

రెండు వారాల క్రితం వరకు ఇండియా కూటమిలో నితీష్ కుమార్ భాగస్వామిగా ఉన్నారు. ఇండియా కూటమి తీరుపై అసంతృప్తితో నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్ కు ఇండియా కూటమి కన్వీనర్ పదవిని ఆఫర్ చేసింది. అయితే ఈ పదవిని నితీష్ కుమార్ స్వీకరించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే నితీష్ కుమార్ ఇండియా కూటమికి గుడ్ బై చెప్పారు.