Bihar Crime News: అవినీతి అధికారి ఇంట్లో డబ్బే..డబ్బు.. చూస్తే.. దిమ్మతిరగాల్సిందే..!
Bihar Crime News: అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు రూ. 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Bihar Crime News: అవినీతి అధికారుల ధన దాహనికి అంతు ఉండదనే దానికి ప్రత్యేక్ష నిదర్శనం ఈ ఘటన. వారికి ప్రభుత్వమిచ్చే జీతం కంటే.. అక్రమంగా సంపాదించే లంచం పైనే మక్కువ. మన దేశంలో అక్రమార్జనకు అవకాశాలు బోలెడు. కావాల్సినంత దోచుకోవచ్చు.. దాచుకోవచ్చు.. కానీ, ఎన్నాడో ఓ రోజు పట్టుపడాల్సిందే.. సంపాదించింది కక్కాల్సిందే.. ఇలాంటి ఘటననే పాట్నాలోని చోటు చేసుకుంది. ఓ డ్రగ్ అధికారిపై దాడి చేసిన అధికారులకు దిమ్మతిరిగి పోయే రేంజ్ లో నగదు బయటపడింది.
అక్రమాస్తుల కేసులో బీహార్కు చెందిన ఓ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నివాసంపై విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు రూ. 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును లెక్కించేందుకు అధికారులు చెమలుకక్కారు. కరెన్సీ కట్టలన్నింటీనీ బెడ్డుపై పోసి..గంటల కొద్దీ లెక్కపెట్టారు. శనివారం రాత్రి వరకు అక్రమ ఆస్తుల స్వాధీన పర్వం జరిగింది.
రాష్ట్ర విజిలెన్స్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారి నివాసం, కార్యాలయంలో జరిపిన దాడుల్లో రూ. 3 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం, వెండి ఆభరణాలు, ఐదు లగ్జరీ వాహనాలు, బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. VIB రోజంతా దాడులు నిర్వహించింది.
2011 నుంచి విధుల్లో చేరిన డ్రగ్ ఇన్స్పెక్టర్ జితేంద్రకుమార్పై శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జెహానాబాద్లోని ఘోన్సీలోని అతని ఇల్లు, గయా పట్టణంలోని ఫ్లాట్లు, దానాపూర్లోని అతని ఫార్మసీ కళాశాల, పాట్నా సిటీలో కొత్తగా నిర్మించిన ఇంటిపై దాడి చేసినట్లు VIB అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఉద్యోగం చేస్తూ.. మరోవైపు ఫార్మసీ కళాశాలను కూడా నడుపుతున్నాడు.