ప్రధాని మీటింగ్ కు దూరంగా బీహార్ సీఎం.. మంగళవారం నాడు పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం
Bihar: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Bihar chief minister Nitish Kumar: ఏన్డీయే కూటమిలో భాగంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జేడీ(యూ)ల మధ్య బంధం క్షీణిస్తున్నదని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ తమను పెద్దగా పట్టించుకోవడం లేదని జేడీ (యూ) నేతలు భావిస్తున్నారట. అలాగే, రాష్ట్రంలో.. కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలు సైతం ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచేవిధంగా మారాయని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో తాజా విభేదాల పుకార్ల మధ్య జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటేరియన్ల సమావేశాన్ని పిలిచారు. JD(U)కి చెందిన ఒక సీనియర్ నాయకుడు.. బీజేపీతో జేడీ(యూ)కు విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ వాటిని ఖండించారు. అలాగే, పార్టీ నుండి ఏ సభ్యుడు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరరని వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు తెరలేపింది.
బీజేపీతో విభేదాల వార్తలపై జేడీ(యూ) సీనియర్ నేత స్పందిస్తూ.. పార్టీ నుండి ఏ సభ్యుడు కూడా కేంద్ర మంత్రి మండలిలో చేరరని చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే శాసనసభ్యులు, ఎంపీలందరితో సమావేవానికి నితీష్ పిలిచారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కీలక నీతి ఆయోగ్ సమావేశాన్ని నితీష్ కుమార్ దాటవేశారు. సమావేశానికి గైర్హాజరైన అతి కొద్ది మంది సీఎంలలో ఆయన కూడా ఉన్నారు. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో భాగమైనప్పటికీ, ఒక ప్రధాన ప్రభుత్వ ఈవెంట్కు ఇది ఒక నెలలోపు గైర్హాజరు కావడం ఇది రెండోది. అంతకుముందు, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోసం ప్రధాని మోడీ ఇచ్చిన విందుతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడే ఇదే విషయం బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
నితీష్ కుమార్ గైర్హాజరు వెనుక ఎటువంటి అధికారిక కారణాలు ఇవ్వనప్పటికీ, కోవిడ్-19 అనంతర సమస్యలను పేర్కొంటూ ఈ ప్రధాని సమావేశానికి దూరంగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్టు పీటీఐ నివేదించింది. అయితే, పాట్నాలో బీజేపీ నేతలు సయ్యద్ షానవాజ్ హుస్సేన్, తార్కిషోర్ ప్రసాద్లు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం గమనార్హం. అంతకుముందు రోజు ఒకప్పుడు నితీష్ కుమార్కు సన్నిహితుడిగా ఉన్న RCP సింగ్, అతనిపై తీవ్ర ఆరోపణలు లేవనెత్తిన తర్వాత పార్టీ నుండి వైదొలిగారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఏ)లో జేడీయూ నుంచి మంత్రివర్గంలో ఉంది అయన ఒక్కరే. అయితే, నితీష్ కుమార్ అతనికి మరోసారి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని నిరాకరించడంతో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగవలసి వచ్చింది. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జేడీ(యూ)ని మునిగిపోతున్న ఓడ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
JD(U) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ మాజీ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. "JD (U) మునిగిపోతున్న ఓడ కాదు, కానీ ప్రయాణించేది. కొంతమంది దానిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. నితీష్ కుమార్ అలా ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి, దానిని సరిదిద్దడానికి చర్యలు తీసుకున్నారు" అని పేర్కొన్నారు. అలాగే, “అతను నిన్ననే పార్టీని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ చాలా కాలం పాటు అతని శరీరం పార్టీలో ఉంది.. అతని ఆత్మ మాత్రం వేరే చోట ఉందంటూ" విమర్శించారు. కేంద్ర మంత్రి మండలిలో ప్రాతినిధ్యం గురించి లాలన్ మాట్లాడుతూ, "మేము 2019 లో లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నాము. మేము ఇప్పుడు కూడా ఆ స్టాండ్కి కట్టుబడి ఉన్నాము. కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదనే నిర్ణయం అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మా నాయకుడు నితీష్ కుమార్ తీసుకున్నారు" అని తెలిపారు.