ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటు హక్కు లేదని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట లభించింది. ఢిల్లీ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటు హక్కు లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం 24 గంటల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. ఎన్నిక ఎప్పుడు నిర్ణయించేది అందులో స్పష్టం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. 

కాగా.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 కౌన్సిలర్ స్థానాల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. 250 స్థానాలున్న ఢిల్లీ కార్పోరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. అయితే జనవరి 6న ఢిల్లీ కార్పోరేషన్ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణం సందర్భంగా ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీకి చెందిన సత్యశర్మను తాత్కాలిక స్పీకర్ గా లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆప్ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. కౌన్సిలర్ల ప్రమాణాన్ని ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ ప్రారంభించేందుకు ప్రయత్నించడంతో ఆప్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. వెల్ లోకి ప్రవేశించి ఆప్ కౌన్సిలర్లు నిరసన చేశారు. కుర్చీలపై నిలబడి ఆందోళన చేశారు. 

ALso REad: ఢిల్లీ మేయర్ ఎన్నిక: ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, కుర్చీలపై ఎక్కి నిరసన

ఇకపోతే.. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ ఆరుగురు స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి మూడుసార్లు సభా సమావేశాలు జరిగినా రసాభాస కావడంతో వాయిదా పడ్డాయి. తొలి సమావేశం జనవరి 6, రెండో సమావేశం జనవరి 24, మూడో సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఓటింగ్‌కు అనుమతించడాన్ని ఆప్ వ్యతిరేకించింది. 15 ఏళ్ల పాటు ఎంసీడీని పాలించిన బీజేపీ ఈసారి కూడా తమ అభ్యర్థినే మేయర్‌గా చేయాలని పావులు కదుపుతోంది.

అత్యధిక సీట్లు గెలుచుకున్న తమకే కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కాలని ఆప్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సంఖ్యాబలం ఆధారంగా కీలకమైన ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో 3 ఆప్ గెలుచుకునే అవకాశం ఉండగా, రెండు కమలనాథులు గెలుచుకునే వీలుంది. దీంతో ఆరో అభ్యర్థి ఎన్నిక కీలకంగా మారింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉంటే బీజేపీ గెలుపు నల్లేరుమీద నడకే కానుందని ఆప్ ఆందోళనగా ఉంది. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.