భీమా-కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కంప్యూటర్ హ్యాక్ కు గురైంది.. సంచనల విషయాలు: అమెరికా ఫోరెన్సిక్ రిపోర్టు
New Delhi: భీమా-కోరేగావ్ కేసులో నిందితుడైన ఫాదర్ స్టాన్ స్వామి కంప్యూటర్ హ్యాకు గురైందనీ, ఈ క్రమంలోనే అందులో ఆధారాలు ఉన్నాయని అమెరికా ఫోరెన్సిక్ సంస్థ తెలిపింది. ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో నిందితుడిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి జూలై 2021లో 84 ఏళ్ల వయసులో మరణించారు.
Bhima-Koregaon case: కోవిడ్-19 కారణంగా గత ఏడాది మరణించిన హక్కుల, సామాజిక కార్యకర్త, ఫాదర్ స్టాన్ స్వామికి సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ గురైందని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ సంచనల విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే భీమా-కోరేగావ్ కేసుకు సంబంధించిన దాదాపు 40కి పైగా సాక్ష్యపు డాక్యుమెంట్లను హ్యాకర్లు హర్డ్ డిస్క్ లో పొందుపరిచారని మరో రెండు కేసులను గురించి ప్రస్తావించిన కంపెనీ నివేదికను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. డిసెంబర్ 31, 2017న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశంలో చేసిన ప్రసంగాలు కారణంగా అక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయని ఫాదర్ స్టాన్ స్వామి సహా పలువురు కార్యకర్తలు, విద్యావేత్తలపై ఆరోపణలకు సంబంధించిన భీమా-కోరేగావ్ కేసు. ఈ సమావేశం జరిగిన తర్వాత రోజు పశ్చిమ మహారాష్ట్ర నగర శివార్లలోని కోరెగావ్-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో హింసను ప్రేరేపించిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు మావోయిస్టు సంబంధాలు, ప్రధాని మోడీపై కుట్రకు తెరలేపారని పలువురు కార్యకర్తలు, విద్యావేత్తలను, రచయితలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టాన్ స్వామి కంప్యూటర్ లో దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ కంప్యూటర్ ను హ్యాక్ చేసి అందులో ఈ పత్రాలను పెట్టారని తాజాగా అమెరికాకు చెందిన ఫొరెన్సిక్ రిపోర్ట్ పేర్కొందని అంతర్జాతీయ మీడియా కథనలు పేర్కొంటున్నాయి.
అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ ప్రకారం.. భీమా-కోరెగావ్ కేసులో చిక్కుకున్న ఫాదర్ స్టాన్ స్వామిని తప్పుడు కేసు ఆధారంగా అరెస్టు చేసి ఉండవచ్చు. అతని కంప్యూటర్ను పరిశీలించిన మసాచుసెట్స్కు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్స్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్, అతని పరికరంలోకి చొరబడిన హ్యాకర్ ద్వారా హార్ డిస్క్లో తప్పుడు సాక్ష్యాలను పెట్టారు. ఈ కేసులో ఇరికించారని మంగళవారం తెలిపింది. మానవ హక్కుల కార్యకర్తలు రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్లకు సంబంధించిన మరో రెండు కేసుల మాదిరిగానే ఇది ఉందని కంపెనీ నివేదికను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి, జూలై 2021లో 84 ఏళ్ల వయసులో మరణించారు. వైద్య కారణాలతో ఆయన మధ్యంతర బెయిల్ కోసం ఎదురుచూస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
"స్టాన్ స్వామి హార్డ్డ్రైవ్లో 50కి పైగా ఫైల్లు క్రియేట్ చేయబడ్డాయి, అందులో అతనికి మావోయిస్టుల తిరుగుబాటుకు మధ్య సంబంధాలను కల్పించే నేరారోపణ పత్రాలు ఉన్నాయి... స్వామిపై దాడికి వారం రోజుల ముందు జూన్ 5, 2019న అతని కంప్యూటర్లో తుది నేరారోపణ పత్రాలు చొప్పించబడ్డాయి" అని నివేదిక పేర్కొంది. ఈ పత్రాల ఆధారంగానే భీమా కోరేగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామిని అరెస్టు చేశారు. చాలా మంది నిపుణులు పత్రాల ప్రామాణికతపై సందేహాలు లేవనెత్తారు అని ది వాషింగ్టన్ పోస్ట్ నివేదికను ప్రస్తావించింది.