భారత్ జోడో యాత్ర: మైసూర్కు చేరుకున్న సోనియా,ఈ నెల 6 యాత్రలో పాల్గొననున్న ఎఐసీసీ చీఫ్
ఎఐసీసీ చీఫ్ సోనియా గాంధీ సోమవారం నాడు మైసూరుకు చేరుకున్నారు.ఈ నెల 6వ తేదీన సోనియాగాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. రేపు , ఎల్లుండి యాత్రకు విరామం ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
మైసూరు:ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ సోమవారం నాడు మైసూరుకు చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొంటారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు, ఎల్లుండి భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించారు.
ఈ నెల6వ తేదీన యాత్ర పున: ప్రారంభం కానుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో సాగుతుంది. మైసూరుకు చేరుకున్న సోనియా గాంధీకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డికే శివకుమార్ స్వాగతంపలికారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంతో పాటు ఇతరత్రా పార్టీకి చెందిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆమె రెండు రోజుల ముందుగానే మైసూర్ కు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రియాంక గాంధీ కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడు, కేరళ మీదుగా యాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో ఈ యాత్రను విజయవంతం చేసేందుకు గాను కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఈనెల 24వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ నుండి మహరాష్ట్రలో ప్రవేశించనుంది.గతంలో రాజీవ్ గాంధీ సద్భావనయాత్ర పేరుతో నిర్వహించిన ర్యాలీ రూట్ లోనే రాహుల్ గాధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది.
also read:కుండపోత వానలోనూ రాహుల్ గాంధీ ప్రసంగం.. వర్షమే కాదు, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు
కన్యాకుమారిలలో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర జమ్మూ కాశ్మీర్ లో పూర్తి కానుంది.ఈ పాదయాత్ర సాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడ జరిగే అవకాశం ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.