బ్రెజిల్ తో ఒప్పందం రద్దు చేసుకున్న భారత్ బయోటెక్..!
ప్రెసిసాతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటికీ కొవాగ్జిన్ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుంది.
కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందిస్తున్న భారత్ బయోటెక్ సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో బ్రెజిల్లో ప్రెసిసా మెడికామెంటో్సతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని భారత్ బయోటెక్ రద్దు చేసుకుంది. బ్రెజిల్లో భారత్ బయోటెక్కు ప్రెసిసా భాగస్వామి కావడం గమనార్హం.
బ్రెజిల్కు 2 కోట్ల డోసుల కొవాగ్జిన్ను సరఫరా చేయడానికి భారత్ బయోటెక్ కుదుర్చుకున్న ఒప్పందం వివాదం కావడంతో దాన్ని రద్దు చేస్తూ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుం ది. ప్రెసిసాతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పటికీ కొవాగ్జిన్ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుంది.
కాగా, అధిక ధర చెల్లించి కొవాగ్జిన్ను బ్రెజిల్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆరోపణలు రావడంతో ఈ ఒప్పందంపై బ్రెజిల్లో విచారణ కూడా చేపట్టారు. మొదట బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రికార్డో మిరందా చేసిన వ్యాఖ్యలతో ఈ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి సందేహాస్పదమైన ఇన్వాయిస్ను క్లియర్ చేయాల్సిందిగా తనపై పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చారని మిరందా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ జోక్యం చేసుకున్నారు.మరోవైపు బ్రెజిల్ సెనేట్ ప్యానెల్ కూడా దీనిపై విచారణ జరుపుతోంది.
భారత్ బయోటెక్ మాత్రం అన్ని ఆరోపణలను తోసిపుచ్చింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం కోసం (EUA) తాము ప్రతీ స్టెప్ను ఫాలో అయ్యామని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆయా దేశాల్లోని చట్టాలకు లోబడే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.విలువలు,సమగ్రత విషయంలో తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొంది.