ఆమె పాపులర్ సింగర్, ప్రవృత్తి చోరీలు.. తొలి బాధితురాలు హీరో విశాల్ తల్లి
ఆమె వృత్తి సింగర్, ప్రవృత్తి దొంగతనాలు.. విమానాల్లో తిరుగుతూ, గొప్పింటి లేడీస్ హ్యాండ్ బ్యాగులు కొట్టేస్తున్న ఓ ఘరానా చోర్ సింగర్ ను ముంబై పోలీసుల అరెస్ట్ చేశారు. బతుకుదెరువు నిమిత్తం ముంబై నుంచి నగరానికి వలస వచ్చి క్లబ్లు, ఈవెంట్లలో పాటలు పాడుతూ మున్మూన్ హుస్సేన్ జీవనం సాగించేది.
ఆమె వృత్తి సింగర్, ప్రవృత్తి దొంగతనాలు.. విమానాల్లో తిరుగుతూ, గొప్పింటి లేడీస్ హ్యాండ్ బ్యాగులు కొట్టేస్తున్న ఓ ఘరానా చోర్ సింగర్ ను ముంబై పోలీసుల అరెస్ట్ చేశారు. బతుకుదెరువు నిమిత్తం ముంబై నుంచి నగరానికి వలస వచ్చి క్లబ్లు, ఈవెంట్లలో పాటలు పాడుతూ మున్మూన్ హుస్సేన్ జీవనం సాగించేది.
క్లబ్బుల్లో క్యాబరేలను ప్రభుత్వం నిషేధించడంతో చోరీలవైపు దృష్టి సారించింది. గత నెలలో ముంబై పోలీసులకు చిక్కిన మున్మూన్ హుస్సేన్ సిటీ పోలీసులు వాంటెడ్గా ఉన్నట్లు తేలింది. ఈమెపై గతంలో సైఫాబాద్ అబిడ్స్ ఠాణాల్లో మూడు కేసులు నమోదై ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్మూన్ హుస్సేన్ కొంతకాలం పాటు కోల్కతాలో సింగర్గా పని చేసింది. ఆ తరువాత హైదరాబాద్కు మకాం మార్చి బార్ అండ్ రెస్టారెంట్స్లో క్యాబరే సింగర్గా మారింది. మరో పక్క గణేష్ ఉత్సవాలు, వివాహాల్లోనూ పాటలు పాడేది.
నగరంలో క్యాబరేను నిషేధించడంతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వివాహాలు, గణేష్ ఉత్సవాలు సీజనల్ కావడంతో చోరీల బాట పట్టిన మున్మున్ మహిళల హ్యాండ్ బ్యాగ్స్ చోరీ చేసేది. ఈ క్రమంలో చెన్నై, అన్నానగర్లో ఉండే హీరో విశాల్ తల్లి జానకీదేవి 2009 జూన్లో హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరయ్యారు.
అదే నెల 15న సాయంత్రం ఆమె పట్టు చీరలు కొనేందుకు బషీర్బాగ్లోని ధర్మవరం సిల్క్ శారీస్ షోరూమ్కు వెళ్లారు. తన హ్యాండ్ బ్యాంగ్ను పక్కన పెట్టి చీరలు ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అరగంట తర్వాత ఆమె తన బ్యాగు కోసం చూడగా అది కనిపించలేదు.
దీంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.65 వేల నగదు, రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ఫోన్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాగు పోయిన దుకాణం అప్పటికే చాలా పాతది కావడంతో అందులో సీసీ కెమెరాలు లేవు. దీంతో కేసు దర్యాప్తు జటిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాగులు చోరీ చేసే పాత నేరస్తుల వివరాలు ఆరా తీశారు.
చోరీ జరిగింది చీరల దుకాణంలో కావడంతో ఈ తరహా చోరీలు చేసే మహిళలపై దృష్టి సారించారు. ఫలితంగా చిక్కడపల్లి సూర్యనగర్లో నివసించే మున్మూన్హుస్సేన్ అలియాస్ మున్మూన్ బౌరా అలియాస్ రచన పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు 2009 ఆగస్టు 12న అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించింది.
దీంతో మున్మూన్ను అరెస్టు చేసి ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రూ.30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. రూ.65 వేల నగదు మాత్రం ఖర్చయిపోవడంతో రికవరీ కాలేదు.
2010 మే 13న మున్మూన్ మరో నేరం చేసింది. కుందన్బాగ్కు చెందిన ఓ బాధితురాలు ఆదర్శ్నగర్లోని బాలాజీ గ్రాండ్ బజార్కు వచ్చింది. అక్కడకు వెళ్లిన ఈ చోర్ సింగర్ ఆమె బ్యాగ్ను తస్కరించింది. అందులో రూ.20 వేల నగదు, తులం బంగారం ఉన్నాయి.
ఈ కేసులోనూ సైఫాబాద్ పోలీసులు మున్మూన్ను అరెస్టు చేశారు. దీనికి ముందే అబిడ్స్ ఠాణా పరిధిలోనే ఆమె ఓ నేరం చేసింది. ఇక్కడి పోలీసుల నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చింది. విమానాల్లోనే తిరుగుతూ పంజా విసరడం మొదలెట్టింది.
కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ల్లో వరుస చోరీలకు పాల్పడింది. తాజాగా గత నెల 17న ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులకు చిక్కింది. ఈమెపై నగరంలో కొన్ని నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో ఇక్కడి పోలీసులకూ వాంటెడ్గా మారింది.