ఎన్నికల ముందు గుజరాత్ బీజేపీకి మరోషాక్.. పార్టీని వీడిన మాజీ సీఎం కొడుకు
Ahmedabad:తాను బీజేపీలో చేరినప్పటికీ, గత ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలు సహా ఇతర కార్యకలాపాల్లో పాల్గొనలేదని మహేంద్రసింగ్ వాఘేలా చెప్పారు. ఇప్పుడు తాను తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాననీ, పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. తాను ఎలాంటి డిమాండ్లు చేయలేదనీ, పార్టీ తనకు ఏ పని ఇచ్చినా దానిని అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.
Gujarat assembly polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బయాద్ ఎమ్మెల్యేగా ఉన్న మహేంద్రసింగ్ వాఘేలా తన తండ్రితో కలిసి పార్టీని వీడారు. శుక్రవారం నాడు గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ రాష్ట్ర యూనిట్ కార్యాలయంలో మహేంద్రసింగ్ వాఘేలాను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ వాఘేలా మీడియాతో మాట్లాడుతూ ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తాను బీజేపీలో ఎప్పుడూ సౌకర్యవంతంగా లేనని ఆయన పేర్కొన్నారు.
తాను బీజేపీలో చేరినప్పటికీ, గత ఐదేళ్లలో పార్టీ కార్యక్రమాలు సహా ఇతర కార్యకలాపాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఇప్పుడు తాను తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాననీ, పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. తాను ఎలాంటి డిమాండ్లు చేయలేదనీ, పార్టీ తనకు ఏ పని ఇచ్చినా దానిని అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. తాను దాదాపు 27 సంవత్సరాలుగా కాంగ్రెస్, పార్టీ నాయకుల కోసం పనిచేశానని, మరోసారి వారితో బాగా కలిసిపోతానని మహేంద్రసింగ్ వాఘేలా పేర్కొన్నారు.
కాగా, 2012లో బయద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మహేంద్రసింగ్ వాఘేలా 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన అనంతరం ఆయన తండ్రి వాఘేలాతో పాటు ఆరుగురు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఏడాదిలోనే గుజారత్ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ (ఆప్), కాంగ్రెస్ లు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాయి. అధికార బీజేపీపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, ఆప్ లు అధికార పార్టీకి గట్టిపోటీగా ముందుకు సాగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆప్ నాయకులు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కొరసాగిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఆప్ కు మద్దతు ఇస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ ఇటీవల పేర్కొనడం సంచలనంగా మారింది.ఇలాంటి తరుణంలో పార్టీని వీడటం బీజేపీకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.