గుజరాత్ అల్లర్లపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ.. పీఎం మోడీపై బురదజల్లే యత్నం: కేంద్రం
గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ పీస్ అని కేంద్ర విదేశాంగ శాఖ కొట్టేసింది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బురదజల్లే యత్నం అని పేర్కొంది.
న్యూఢిల్లీ: బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) గుజరాత్ అల్లర్లపై తీసిన డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ అని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై బురదజల్లే యత్నం అని పేర్కొంది. అపకీర్తిని తెచ్చి పెట్టే విధంగా ఈ డాక్యుమెంటరీ డిజైన్ చేశారని తెలిపింది. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం విలేకరులతో ఈ అంశంపై మాట్లాడారు. ‘ఇది ఒక ప్రాపగాండ పీస్, అపకీర్తిని తెచ్చిపెట్టే రీతిలో దీన్ని రూపొందించారని భావిస్తున్నాం. పక్షపాతం, లక్ష్యం లేనితనం, వలసవాద మానసిక స్థితి యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది’ అని అన్నారు.
ఈ డాక్యుమెంటరీ మన దేశంలో స్క్రీన్ కాదని వివరించారు. ఇది వాస్తవ పరిస్థితులను కాకుండా.. తీస్తున్న ఏజెన్సీ, వ్యక్తులు, దుష్ప్రచారాన్ని చేయాలనుకుంటున్న అభిప్రాయాలే ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే డాక్యుమెంటరీలో కనిపిస్తాయని వివరించారు. అసలు ఈ డాక్యుమెంటరీ వెనుక ఉన్న అజెండా, ఈ మూవీ తీయాల్సిన ఆవశ్యకతల గురించి ఆలోచించినా ఆశ్చర్యం అనిపిస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో కీర్తించాల్సిన అవసరం లేదని అన్నారు.
Also Read: భారత్ అతి త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది : S&P అంచనా
ఈ మూవీ గురించిన చిన్న వివరణలో ఇలా ఉన్నది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ముస్లిం మైనార్టీల మధ్య ఘర్షణ, సుమారు వేయి మందిని పొట్టనబెట్టుకున్న 2002 అల్లర్లలో మోడీ పాత్ర గురించి దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు అని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఏమీ లేదని సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది. ఆయన నిర్దోషి అని గతేడాది సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది.