జమ్ము కశ్మీర్‌లో మరొకరి హత్య జరిగింది. రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ అనే బ్యాంక్ మేనేజర్‌ను కశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఈ మేరకు కశ్మీర్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నట్టు వివరించారు. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో మరో వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి హతమార్చారు. రాజస్తాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్‌ను ఈ రోజు ఉదయం దుండగులు కాల్చి చంపారు. రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ జమ్ము కశ్మీర్ కుల్గాం జిల్లా అరె మోహన్‌పొరాలోని ఇల్లాఖీ దెహతి బ్యాంక్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బ్యాంకుకు వెళ్తుండగా ఆయనపై కాల్పులు జరిపారు. 

ఈ ఉగ్ర ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసు అధికారులు ట్విట్టర్‌లో వెల్లడించారు. అనంతరం ఆయనను సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన పరిస్థితి విషమించి కన్ను మూశాడు. 

బ్యాంక్ మేనేజర్‌పై కాల్పులు జరిగిన తర్వాతే పోలీసులు ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 

Scroll to load tweet…

షోపియన్‌లో ఇదే రోజు ఓ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ బాంబ్ బ్లాస్ట్ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలోనే బ్యాంక్ మేనేజర్‌ హత్య జరిగింది. బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ రాజస్తాన్‌లోని హనుమాన్ గడ్‌కు చెందినవారని గుర్తించారు.

ఇదే దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితమే హిందూ మహిళను ఉగ్రవాదులు చంపారు. రజ్నీ బాలా అనే కశ్మీరీ పండిట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు. భర్త, కుమార్తెలతో ఆమె సాంబాలో నివసించేవారు. కానీ, ఈ మహిళా ఉపాధ్యాయురాలిని రెండు రోజుల క్రితమే ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గతవారం టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌ను లష్కర్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 12వ తేదీన రెవెన్యూ డిపార్ట్‌మెంటు‌లో పని చేసిన రాహుల్ భట్‌నూ ఉగ్రవాదులు కాల్చి చంపేసిన ఘటన తెలిసిందే. కొన్నాళ్లుగా జమ్ము కశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఊచకోతకు పాల్పడుతున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.