భారతదేశంలో ఉన్న షేక్ హసీనా పై బంగ్లా ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. రాజకీయ అల్లర్ల సమయంలో ఆమె దేశం విడిచి భారత్ చేరారు.
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు ఉదృతమవుతున్న సమయంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవిని వదిలిపెట్టి దేశం విడిచిన సంగతి తెలిసిందే. 2023 ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ నుంచి బయలుదేరి భారతదేశానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె అక్కడే తలదాచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెపై సహా పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇటీవల ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం కీలక సమాచారం ట్రైబ్యునల్కు సమర్పించారు.
అతను తెలిపిన ప్రకారం, దేశంలో పరిస్థితులు చెలరేగిన సమయంలో 2023 ఆగస్టు 4న ఆర్మీ అధికారులు షేక్ హసీనా నివాసానికి వెళ్లి ఆమెను రాజీనామా చేయమని కోరారు. అయితే, అవామీ లీగ్కి చెందిన పలువురు ప్రముఖులు దీనిని వ్యతిరేకించారని తెలిపారు. అంతేకాక, అప్పటి పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరియు ఆమెను పదవి నుంచి తప్పుకోవాలని సూచించారని చెప్పారు.
కానీ హసీనా ఈ సూచనను అంగీకరించలేదని, ఆమె బదులుగా “నన్ను కాల్చి చంపండి.. కానీ దేశం విడిచిపెట్టలేను” అంటూ ఆర్మీ అధికారులతో మొరపెట్టుకున్నారని ఆయన తెలిపారు. చివరికి అధికారుల ఒత్తిడి కారణంగా ఆమె దేశం విడిచి భారత్కు వెళ్లినట్లు పేర్కొన్నారు.ఇప్పటికే షేక్ హసీనా పై 100కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. ట్రైబ్యునల్ ఆమెపై జారీ చేసిన అరెస్టు వారెంట్లతో పాటు, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. హసీనా అప్పగింతకు సంబంధించి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్కు పలుమార్లు అధికారికంగా విజ్ఞప్తి పంపినట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రైబ్యునల్ విచారణ ఎటు మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.