బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మే కుట్ర జరుగుతోందని షేక్ హసీనా ఆరోపణ. యూనస్‌ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో ఇటీవల మళ్లీ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేశ తాత్కాలిక పాలకుడిగా ఉన్న ముహమ్మద్ యూనస్‌ మీద మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. యూనస్‌ పట్ల ఉన్న అసంతృప్తిని ఆమె ఓ ఆడియో సందేశం రూపంలో వ్యక్తం చేస్తూ, ఆయన పాలన వెనక అమెరికా కుట్ర ఉందని బాంబు పేల్చారు.

హసీనా అభిప్రాయం ప్రకారం, అమెరికా వారికి కీలకమైన సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తీసుకోవాలని గతంలో కోరిందని, అప్పుడు తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ ఆ డిమాండ్‌ను ఒప్పుకోలేదని చెప్పారు. అదే కారణంగా ఆయన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న ఆమె, అధికారంలో ఉండాలన్న కోరిక కోసం ఎప్పుడూ తాను దేశాన్ని అమ్మాలనుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో దేశాన్ని పరాయి బలాలకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

యూనస్‌ పాలనపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే సంస్థల మద్దతుతోనే యూనస్‌ అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఒకే ఒక్క ఉగ్రదాడి జరిగినా దానికి తగిన శిక్షలిచ్చామనీ, అనేక మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశామనీ చెప్పారు. కానీ, ప్రస్తుతం జైళ్ళు ఖాళీగా ఉన్నాయనీ, నేరస్తులను విడిచిపెడుతూ ఉగ్రవాదానికి అవకాశమిస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాదు, తన పార్టీ అయిన బంగ్లా అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించడం పూర్తిగా చట్ట విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజల మద్దతు లేని పాలకుడు, పార్లమెంటు ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఎలా మార్చగలడని ప్రశ్నించారు. దేశానికి అన్యాయం జరుగుతోందన్న ఆవేదన ఆమె వ్యాఖ్యల నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తలనొప్పిగా మారాయి. యూనస్‌ ప్రభుత్వం దీనిపై ఇంకా స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. కానీ, షేక్ హసీనా చేసిన ఆరోపణలు దేశీయంగానే కాక, అంతర్జాతీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది.