నీళ్లు నింపిన వాషింగ్ మెషిన్‌లో పడిన ఓ చిన్నారి చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. దాదాపు 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి విజయం సాధించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.  

ఢిల్లీలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. సబ్బు నీళ్లతో నిండిన వాషింగ్ మెషిన్‌లో పడి 15 నిమిషాల పాటు విలవిలలాడిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గమనించడంతో గండం గడిచిపోయింది. అసలేం జరిగిందంటే.. జాతీయ దినపత్రిక ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించిన ప్రకారం చిన్నారిని వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే వాషింగ్ మెషిన్‌లో పడటంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో పాటు తీవ్రమైన చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని వైద్యులు తెలిపారు. మూత తెరిచి వున్న టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌లో చిన్నారి పడిపోయాడు. ఆ సమయంలో తల్లి గదిలో లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

బాలుడు కుర్చీపైకి ఎక్కి ప్రమాదవశాత్తూ వాషింగ్ మెషిన్‌లో పడివుండవచ్చని అతని తల్లి చెప్పింది. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకుందని డాక్టర్ హిమాన్షు జోషి తెలిపారు. సబ్బు నీరు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి వాటితో చిన్నారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. చిన్నారికి అవసరమైన యాంటీ బయాటిక్స్, ఫ్లూయిడ్ సపోర్ట్ అందించామని హిమాన్షు చెప్పాడు. మెరుగైన చికిత్సతో చిన్నారి కోలుకున్నాడని.. తర్వాత వెంటిలేటర్‌ను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.