బాబ్రీమసీదు కేసును ఎప్పటిలోపుగా పూర్తి చేస్తారు: సుప్రీం
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఎప్పటిలోగా ముగిస్తారో తెలపాలని లక్నో సెషన్స్ జడ్జిని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఎప్పటిలోగా ముగిస్తారో తెలపాలని లక్నో సెషన్స్ జడ్జిని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. బాబ్రీ కేసు విచారణపై కాలపరిమితిని సీల్డ్ కవర్లో తెలపాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రతో కూడిన సుప్రీం బెంచ్ లక్నో సెషన్స్ జడ్జిని కోరింది.
ఇదే కేసులో విచారణను ముగించాలన్న సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో తన ప్రమోషన్ను అలహాబాద్ హైకోర్టు నిలిపివేయడంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ అప్పీల్పై యూపీ ప్రభుత్వ స్పందనను కోరుతూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 14 మందిపై గత ఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు అభియోగాలను అనుమతించింది. అయోధ్య కేసులో అద్వానీ, జోషీ, ఉమాభారతిలను నేరపూరిత కుట్ర నేరం కింద ప్రాసిక్యూట్ చేయవచ్చని న్యాయస్థానాన్ని కోరింది.
త్వరితగతిన విచారణ చేపట్టి ఏప్రిల్ 19, 2019 నాటికి విచారణ ముగించాలని ప్రత్యేక న్యాయస్ధానాన్ని కోరింది. పూర్తి విచారణ ముగిసేవరకూ న్యాయమూర్తి బదిలీని చేపట్టరాదని, విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.