అయోధ్య: అవసరమైతే ఈనెల 25వ తేదీ నుండి రోజు వారీ విచారణ
అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఈ నెల 18వ తేదీ లోపుగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీమసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ ఈ నెల 18వ తేదీ లోపుగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
అయోధ్య కేసులో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం కన్పించడం లేదని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం నాడు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మధ్యవర్తిత్వ కమిటీ సామరస్య పరిష్కారం చూపకపోతే ఈ నెల 25వ తేదీ నుండి రోజు వారీ విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటిని ఈ ఏడాది మార్చి8వ తేదీన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
ఇటీవలనే ఈ కమిటీ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. మరోవైపు తమకు మరింత గడువును ఇవ్వాలని ఈ కమిటీ సుప్రీంకోర్టును కోరింది. ఆగష్టు 15వ తేదీ వరకు న్యాయస్థానం గడువును ఇచ్చింది.