ముంబాయిలో ఓ మైనర్ పై పొరిగింట్లో నివసించే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు నిందితుడిని కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు.
సమాజంలో నేడు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. మహిళలపై లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. చిన్నారులు, బాలికలు అని కూడా వారిపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. బెదిరించి లైంగిక దోపిడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలోని ముంబాయిలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయిలోని ములంద్ ప్రాంతంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆ ఇంటికి సమీపంలోనే 21 ఏళ్ల యువకుడు కూడా నివసిస్తున్నాడు. వీరిద్దరికి పరిచయం ఉంది. అయితే ఆదివారం ఆ బాలక తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. దీంతో ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని ఆ యువకుడు అదనుగా భావించారు.
మరో స్నేహితుడితో కలిసి ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. కత్తితో ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కొంత సమయం తరువాత ఆ బాలిక తల్లి ఇంట్లోకి వచ్చింది. బాలిక ముభావంగా ఉండటంతో ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో ఆ యువకుడు చేసిన దారుణాన్ని తల్లికి వివరించింది.
ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాంకేతికతను ఉపయోగించి కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. అయితే మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లైంగిక దాడికి సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాలిక గోప్యతను కాపాడేందుకు ఆమె గుర్తింపును వెల్లడించలేదని పోలీసు అధికారి ‘టైమ్స్ నౌ’తో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇదే ముంబాయిలోని ఘట్కోపర్ లో ఓ మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితురాలిని వేధించి, కట్నం డిమాండ్ చేసినందుకు మామ, మరో నలుగురిపై ఐపీసీ సెక్షన్ 376 కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.