రాజీవ్ గాంధీపై అటల్ బిహారి వాజ్పేయి ప్రశంసలు కురిపించిన వేళ.. (వీడియో)
రాజీవ్ గాంధీపై అటల్ బిహారి వాజ్పేయి ప్రశంసలు కురిపిస్తున్న అరుదైన విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ఆయన ఈ వీడియోను ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ఈ రోజు దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ అభిమానులు ఆయన 78వ జయంతిని వేడుక చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయన సాధించిన కీలక మైలురాళ్లను గుర్తు చేసుకుంది. యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తీసుకున్న నిర్ణయాలు ల్యాండ్మార్క్ డెసిషన్స్గా ఉండిపోయాయని పేర్కొంది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కమ్యూనికేషన్స్ ఇంచార్జీ జైరాం రమేశ్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో అటల్ బిహారి వాజ్పేయి... రాజీవ్ గాంధీని ప్రశంసిస్తున్నారు.
ఆ వీడియోలో అటల్ బిహారి వాజ్పేయి మాట్లాడుతూ, ‘నా కిడ్నీ ఫెయిల్ అయింది. తదుపరి చికిత్స కోసం వైద్యులు నన్ను అమెరికాకు వెళ్లాలని సూచించారు. కానీ, ఆర్థికంగా అది నాకు చాలా కష్టం. ఏదో విధంగా ఈ విషయం రాజీవ్ జీకి తెలిసింది. ఆయన నన్ను పిలిపించుకున్నారు. ఐరాసకు వెళ్లే ప్రతినిధుల బృందంలో నన్ను చేర్చారు. నేను ఆ బృందంలో ఫుల్ఫ్లెడ్జ్డ్ మెంబర్ అయ్యాను. నా మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కేంద్ర ప్రభుత్వమే భరించింది. నేను ఫుల్గా కోలుకుని తిరిగి వచ్చాను’ అని వివరించారు.
అటల్ బిహారి వాజ్పేయి దేశానికి పదో ప్రధానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1984 నుంచి 1989 వరకు ఆరో ప్రధానిగా వ్యవహరించిన రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్లో ఎల్టీటీఈ సూసైడ్ బాంబర్ హతమార్చారు.
జైరాం రమేశ్ మరో ట్వీట్లోనూ అటల్ బిహారి వాజ్పేయి.. రాజీవ్ గాంధీపై చేసిన ప్రశంసలకు మరో ఇంకో రిఫరెన్స్ ఇచ్చారు. ఎన్పీ ఉల్లేఖ్ రాసిన ది అన్టోల్డ్ వాజ్పేయి పుస్తకంలో ఆయన రాజీవ్ గాంధీ పట్ల గౌరవంగా ఉన్న తీరు, రాజీవ్ గాంధీ తనను కాపాడిన విధాన్ని వాజ్పేయి స్వయంగా అంగీకరించిన విషయాలు ఉన్నాయని తెలిపారు. రాజీవ్ గాంధీ కేవలం ప్రభావశీల ప్రధాని మాత్రమే కాదు అని పేర్కొన్నారు. డీసెంట్, సెన్సిటివ్ వ్యక్తి అని తెలిపారు.
అంతకు ముందు జైరాం రమేశ్ ఇంకో ట్వీట్ చేశారు. అందులో రాజీవ్ గాంధీ తీసుకున్న విలువైన నిర్ణయాలను ప్రస్తావించారు. ఆయన ఒకే సారి ప్రధానిగా చచేసినా.. ఆయన సాధించిన విజయాలు అనూహ్యమైనవని తెలిపారు. సామాజిక సవాళ్లను అధిగమించడానికి ఆయన టెక్నాలజీ మిషన్లు ప్రవేశపెట్టారని వివరించారు. ఉదాహరణకు టీకా ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా వెలగడం, దేశంలో పోలియో లేకుండా చేయడం వంటివి ఉంటాయని తెలిపారు.