కనీసం కొంత మంది క్రీడాకారులకైనా గౌరవం దక్కుతోంది - సీఎస్ కే విజయంపై రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందన
ఐపీఎస్ - 2023లో టైటిల్ కైవసం చేసుకున్న సీఎస్ కేను, ఆ టీమ్ సారథి ఎంస్ ధోనిని రెజ్లర్, 2016 రియో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ అభినందించారు. కనీసం కొంత మంది క్రీడాకారులకైనా గౌరవం దక్కుతోందని, తాము ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని ఆమె ట్వీట్ చేశారు.
ఐపీఎల్ - 2023 ఫైనల్ లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఓడించింది. సీఎస్ కే ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా సీఎస్ కే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఫైనల్లో వీరోచిత ప్రదర్శన చేసిన జడేజాకు, సీఎస్ కే కెప్టెన్ గా ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ధోనీకి సోషల్ మీడియా వేదికగా అభినందనల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పిన పెను ప్రమాదం.. బెళగావిలో ట్రైనింగ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలట్లకు గాయాలు
సీఎస్ కే విజయం, స్టార్ క్రికెటర్లకు లభిస్తున్న మద్దతు, ప్రశంసల నేపథ్యంలో 2016 రియో ఒలింపిక్స్ లో భారత్ కు కాంస్య పతకం అందించిన ఛాంపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా స్పందించారు. టైటిల్ గెలచుకున్నందుకు ధోనీ, సీఎస్కేను ఆమె అభినందించారు. అలాగే తమకు ఇంకా న్యాయం జరగలేదని, తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎంఎస్ ధోనీకి, సీఎస్ కేకు అభినందనలు. కనీసం కొంతమంది క్రీడాకారులకైనా తగిన గౌరవం, ప్రేమ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. న్యాయం కోసం మా పోరాటం ఇంకా కొనసాగుతోంది’’ సాక్షి మాలిక్ మంగళవారం ట్వీట్ చేశారు.
దేశ రాజధానిలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న రెజ్లర్లు నిరసన కొనసాగిస్తున్నారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా వీరంతా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఇందులో వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు ఇతర ప్రముఖ మల్ల యోధులు ఉన్నారు. ఒక మైనర్ సహా పలువురు మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించడమే కాదు.. ఎంపీగానూ అనర్హుడిని చేయాలని, అరెస్టు చేసి ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఈ రెజ్లర్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఈ నిరసనల్లో భాగగా పార్లమెంటు ప్రారంభోత్సవం రోజున కొత్త భవనానికి సమీపంలో మహిళా మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు భావించారు. అయితే దీనికి పోలీసులు అనుమతించలేదు. కానీ కొత్త పార్లమెంట్ భవనం దగ్గరకు వెళ్లేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లకు, పోలీసులకు తోపుటాల జరిగింది. ఈ సమయంలో పోలీసులు నిరసనకారులపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిరసనకారుల పట్ల ఢిల్లీ పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసుల తీరును దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండించారు. ఈ వైరల్ అయిన ఫొటోల్లో సాక్షి మాలిక్ తీవ్రంగా ప్రతిఘటనకు గురైనట్టు కనిపించింది.