కరోనా కల్లోలం: ఇండియాలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 1,15,736 మందికి కరోనా సోకింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైనట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 1,15,736 మందికి కరోనా సోకింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైనట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులే ఇందుకు ఉదహరణగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం తొలిసారి లక్ష కరోనా కేసుల మార్క్ దాటింది. ఇవాళ కూడ 1,15,736 కరోనా కేసులు నమోదయ్యాయి.రెండు రోజుల క్రితం 1,03,556 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనాతో నిన్న ఒక్కరోజే 630 మంది చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడింది. 1,66,177మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా నుండి కోలుకొంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం నాడు ఒక్కరోజునే 59, 856 మంది కరోనా నుండి కోలుకొన్నారు. మొత్తంగా 1,17,92,135 మంది కరోనా నుండి బయటపడ్డారు.దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదౌతున్నాయి. గత 24 గంటల్లో 55 వేలకు పైగా నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు, మరణాలు రికార్డు అవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.