కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని సీట్లతో సహా ముందే చెప్పిన జోతిష్కుడు.. 2024 ఎన్నికలపైనా వ్యాఖ్య
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని మార్చి నెలలో పంచాంగకర్త అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వివరించారు. అంతేకాదు, 123 నుంచి 133 మధ్య సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రముఖ జ్యోతిష్కుడు, వేదిక్ అస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే కాదు.. ఎన్ని సీట్లను కైవసం చేసుకుందో కూడా ముందే జోస్యం చెప్పారు. ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల (మే) 10వ తేదీన జరగ్గా.. ఈ నెల 13వ తేదీన ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. రుద్ర కరణ్ పర్తాప్ తన ట్వీట్లో ఇలా పేర్కొన్నారు. మే నెల బీజేపీకి అనుకూలంగా లేదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్కే అధికంగా ఉన్నాయని అంచనా వేశారు. డీకే శివకుమార్ గొప్ప యోగిని దశ గుండా వెళ్లుతున్నారని తెలిపారు.
ఇవన్నీ తాను వారి జన్మ దిన వివరాలను సేకరించి పరిశీలించానని ఆయన వెల్లడించారు.
కాగా, 18 రోజుల తర్వాత ఒక ట్విట్టర్ యూజర్ ఓ ప్రశ్న వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది సార్ అంటూ అడిగారు. అందుకు రుద్ర కరణ్ పర్తాప్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు.
రుద్ర కరణ్ పర్తాప్ మార్చిలో చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు మరోసారి తన ట్వీట్లను గుర్తు చేస్తూ పోస్టు చేశారు. ఈ సారి 2024 సార్వత్రిక ఎన్నికలపైనా కామెంట్ చేశారు. తాను ఈ విషయాలను మార్చి నెలలో అంచనా వేశానని తెలిపారు. వారి జన్మ నక్షత్రాలు అవే చెబుతున్నాయని వివరించానని పేర్కొన్నారు. తాను ఊహించినట్టే కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి.. బీజేపీని గద్దె దించు తున్నదని వివరించారు. కానీ, 2024 ఎన్నికల కోసం ఇప్పుడు పోరు ప్రారంభమైందని చెప్పలేమని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి వారిని మరింత పాటుపడేలా చేస్తుందని వివరించారు. వచ్చే నెలల్లో వారు మరింత విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఊహించారు.