గుజరాత్లో కేజ్రీవాల్ రోడ్షోలో మోడీ-మోడీ అంటూ నినాదాలు.. ఆప్ చీఫ్ ఎమన్నారంటే..?
Gandhinagar: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఆదివారం గుజరాత్లో కేజ్రీవాల్ రోడ్షో సందర్భంగా కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై ఆయన ఘాటుగానే స్పందించారు.
Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. అయితే, ఆదివారం గుజరాత్లో కేజ్రీవాల్ రోడ్షో సందర్భంగా కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. పంచమహల్ జిల్లాలోని హలోల్లో సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ రోడ్ షోలో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీనిపై కేజ్రీవాల్ నినాదాలు చేసిన వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు. మీరందరూ ఎవరికి అనుకూలంగా ఏదైనా నినాదం చేయవచ్చని పేర్కొన్న ఆయన.. "నేను మీ పిల్లలకు పాఠశాలలు నిర్మిస్తాను.. మీకు ఉచిత విద్యుత్ అందిస్తాను" అంటూ కేజ్రీవాల్ చెప్పారు.
అలాగే, ‘మోడీ.. మోడీ’ అంటూ కొందరు అరుస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎవరికి అనుకూలంగా వారు నినాదాలు చేయమని తాను వారికి చెప్పాలనుకుంటున్నాని అన్నారు. అయితే, "కేజ్రీవాల్ మీ పిల్లలకు పాఠశాలలు నిర్మిస్తారు. మీకు కావాల్సినన్ని నినాదాలు చేయవచ్చు, కానీ మీకు ఉచిత విద్యుత్ ఇస్తాను.. మోడీకి అనుకూలంగా నినాదాలు చేసే ప్రజల హృదయాలను ఆమ్ ఆద్మీ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే, తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని కేజ్రీవాల్ అన్నారు. ఎవరికి కావాలంటే వారికి అనుకూలంగా నినాదాలు చేయవచ్చు. ఏదో ఒక రోజు తాము అందరి మనసు గెలిచి తమ పార్టీలోకి తీసుకొస్తామని అన్నారు. తమ పార్టీ ఉపాధి హామీని, ఉద్యోగార్థులకు రూ.3,000 నిరుద్యోగ భృతిని హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత నిరుద్యోగులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ బీజేపీ సర్కారుపై పై విమర్శలు చేశారు.
పాఠశాలల గురించి మాట్లాడే పార్టీ ఏదీ లేదని కేజ్రీవాల్ అన్నారు. "పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామనీ, ఉద్యోగాలు ఇస్తామనీ, ఉచిత కరెంటు ఇస్తామనీ ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా? అని ప్రశ్నిస్తూ.. ఈ సమస్యల గురించి మాట్లాడేది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. ప్రజలు గూండాయిజం, దూషణలను ఇష్టపడితే, వారు బీజేపీకి మద్దతు ఇవ్వగలరు" అంటూ అధికార పార్టీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు నిర్మించాలంటే తమతో కలిసి రావాలని కేజ్రీవాల్ అన్నారు. "నేను ఇంజనీర్ ను.. మీకు కరెంటు, ఆసుపత్రులు, రోడ్లు కావాలంటే నా దగ్గరకు రండి. నేరాల కోసం వారి (బీజేపీ) వద్దకు వెళ్లండి. ఐదేళ్లు అడగడానికే ఇక్కడికి వచ్చాను. మీరు వారికి (బీజేపీ) 27 సంవత్సరాలు ఇచ్చారు, నాకు ఐదేళ్లు ఇవ్వండి. నేను పని చేయకుంటే ఇక మీ ముందుకు రాను" అని కేజ్రీవాల్ అన్నారు.