Uttarakhand Assembly Election 2022: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అన్ని పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ.. ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ ఆదివారం ఖ‌రారు చేయ‌నుంద‌ని స‌మాచారం.  

Uttarakhand Assembly Election 2022: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల న‌గారా మోగిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఓటింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంలో రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తూ.. ప్ర‌చారంలో వేగం పెంచాయి. ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల ఉత్త‌రాఖండ్ కూడా ఒక‌టి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల (Uttarakhand Assembly Election) బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల‌ను నేడు ఖ‌రారు చేయ‌నుంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై ఆదివారం నాడు న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధాన కార్యాలయంలో మేధోమథనం జరగనుంది. దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ స‌మావేశంలో దీనిపై కూడా చ‌ర్చించ‌నున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు. వీరితో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి , రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రహ్లాద్ జోషి, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. ఆయా నేత‌లు ఆదివారం ఉద‌యం ఢిల్లీకి బ‌య‌లు దేరారు. 

ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్యర్థుల ఖ‌రారు చేయ‌డానికి స‌మావేశం ఒక్క రోజు మాత్రమే జరుగుతుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుందని BJP విశ్వసనీయ వర్గాల సమాచారం. అభ్యర్థి గెలుపోటములను బట్టి టిక్కెట్టు కేటాయించే అంశాల‌ను ప‌రిశీలించ‌నుంది. ఉత్తరాఖండ్ అభ్యర్థులను నిర్ణయించడంలో ఆ రాష్ట్ర ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని 20 మంది కొత్త అభ్యర్థులకు టిక్కెట్టు ఇవ్వవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఒక నియోజకవర్గంలో అభ్యర్థిత్వాన్ని పార్టీ నిర్ణయిస్తున్న‌ద‌ని తెలిసింది. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (Uttarakhand Assembly Election) ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.

బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ధామి మీడియాతో మాట్లాడుతూ.. "నేను ఖతిమా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను. అందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తాం" అని అన్నారు.'అబ్కీ బార్ 60 పార్' నినాదంతో అసెంబ్లీలోని 70 సీట్లలో 60 సీట్లకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ (Uttarakhand Assembly Election) ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. బ‌హిరంగ ర్యాలీలు, పెద్ద స‌భ‌లు వంటి వాటిపై క‌రోనా నేప‌థ్యంలో ఆంక్ష‌లు విధించ‌డంతో రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం డిజిట‌ల్ వేదిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే డిజిట‌ల్ ప్రచారంతో పాటు ఇంటింటికీ ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని బీజేపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 70 మంది సభ్యులున్న ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు (Uttarakhand Assembly Election) ఫిబ్రవరి 14న జరగనుండగా.. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.