Goa Assembly Election 2022: గోవా ఎన్నికలు.. పొత్తులపై వస్తున్న చర్చలకు తెరదించిన కాంగ్రెస్ !
Goa Assembly Election 2022: వచ్చే నెలలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం.. పొత్తులతో ముందుకు సాగుతున్నాయి. అయితే, గత కొంత కాలంగా ఉప్పు నిప్పుగా మారిన కాంగ్రెస్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో జతకట్టబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Goa Assembly Election 2022: దేశంలో త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జగనున్నాయి. ఇటీవలే ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సైతం ప్రకటించింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార హోరును కొనసాగిస్తున్నాయి. ఈ సారి గోవా ఎన్నికల్లో మొదటి సారి బరిలో నిలవడానికి సిద్ధమైంది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అక్కడి స్థానిక ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ప్రచారం కొనసాగిస్తోంది. గోవాలో అధికారం దక్కించుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవలి గత కొంత కాలంగా ఉప్పు నిప్పులా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు గోవా ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని తెగ ప్రచారం జరగుతోంది. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్తో జట్టు కట్టే సాధ్యాసాధ్యాలపై మంగళవారం రాహుల్ గాంధీ చర్చించనున్నట్టు వార్తలు వచ్చాయి. గోవా కాంగ్రెస్ నేతలతో ఆయన ఢిల్లీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని పలు రాజకీయ వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఈ రెండు పార్టీలు కలిపి పోటీ చేస్తాయా? లేదా? అనే విషయం గురించి కాంగ్రెస్ కానీ, తృణమూల్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రాజకీయాల్లో చర్చ మొదలైంది. తాజాగా దీనికి తెరదించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెతో కలిపి పోటీ చేయబోతున్నదనే వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ ఖండించారు. దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడం లేదని హస్తం సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుల విషయం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చించలేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉందని తెలిపారు. గోవాలో తిరిగి అధికారం దక్కించుకుంటామనీ, పార్టీ త్వరలోనే పుంజుకుంటుందని కేసీ.వేణుగోపాలు వెల్లడించారు.
ఇదిలావుండగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నిలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో జంప్ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. పంజాబ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అంతర్గత పోరు కారణంగా రెండు వీడిపోయింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో బరిలో నిలవనున్నట్టు అయన పేర్కొన్నారు. ఇప్పటికే పొత్తుల గురించి బీజేపీ అగ్రనేతలతో కలిసి చర్చించారు. పంజాబ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేయాలని చూస్తోంది. అలాగే, పలువురు రైతు నాయకులతో ఏర్పడిన మరో కొత్త పార్టీ కూడా పంజాబ్ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్టు ప్రకటించింది. దీంతో పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, శిరోమణి ఆకాలీదళ్, రైతు పార్టీలులతో పంచముఖ పోరు సాగనుందని తెలుస్తోంది.