Postal Ballot in Elections 2022: ఇక జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం.. ఆ ఉద్యోగులకు కూడా...
Postal Ballot in Elections 2022: త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల నుంచి మీడియా సిబ్బంది, జర్నలిస్టులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని, ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
Postal Ballot in Elections 2022: త్వరలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో గుర్తింపు పొందిన జర్నలిస్టుల పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించింది. అంతముందు.. 80 ఏళ్లు పైబడివారు, దివ్యాంగులు (40శాతం కంటే ఎక్కువ),కరోనా సోకినవారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయడానికి ఈసీ ఆమోదం తెలిపింది.
తాజాగా ఈ జాబితాలో అదనంగా పాత్రికేయులను చేర్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. వీరితో అత్యవసర సర్వీసు విభాగాలకు సంబంధించి లిస్ట్ ను విడుదల చేసింది. ఫుడ్ సివిల్ సప్లై అండ్ కన్జూమర్ అఫైర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్, పోస్ట్ అండ్ టెలిగ్రామ్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, హెల్త్, ఫైర్ సర్వీస్, సివిల్ ఏవియేషన్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈసీ తెలిపింది. వీరితో పాటుగా ఎన్నికల తేదీల్లో విధులు నిర్వహించే ఇతర అత్యవసర విభాగాల సిబ్బందికి ఈ సదుపాయం కల్పించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిర్ణయించిన తేదీ కంటే ముందు అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓటింగ్ కేంద్రాలు (PVC) వరుసగా మూడు రోజుల వరకు తెరిచి ఉంటాయి. ప్రతి మూడు రోజులలో, PVC ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.
పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారు. ఎవరైనా గైర్హాజరైన ఓటరు ఫారం-12డిలో రిటర్నింగ్ అధికారికి అవసరమైన అన్ని వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత సంస్థ నియమించిన నోడల్ అధికారి ద్వారా దరఖాస్తును ధృవీకరించాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కోరుకునే అటువంటి దరఖాస్తులు ఎన్నికల ప్రకటన తేదీ నుండి సంబంధిత ఎన్నికల నోటిఫికేషన్ తేదీ తర్వాత ఐదు రోజుల మధ్య వ్యవధిలో రిటర్నింగ్ అధికారికి చేరుకోవాలి. మరోవైపు ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.