దారుణం.. క్యూలోనే మహిళ ప్రసవం
జనాభా లెక్కల్లోని తన పేరు ఎక్కించుకోవడానికి వచ్చి క్యూలైన్ లోనే ఓ మహిళ బిడ్డను ప్రసవించింది.
జనాభా లెక్కల్లోని తన పేరు ఎక్కించుకోవడానికి వచ్చి క్యూలైన్ లోనే ఓ మహిళ బిడ్డను ప్రసవించింది. ఈ దారుణ సంఘటన అస్సాంలోని దక్షిణ సాల్మారా జిల్లాలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర రాజధాని గౌహతికి 250కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం బాధాకరం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సాల్మారా ప్రాంతానికి చెందని మహిళ పేరు అస్సాం రాష్ట్ర జనాభా లెక్కల్లో లేదు. దీంతో వెంటనే ఆ జాబితాలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె గత వారం సిటిజన్స్ నేషనల్ రిజిష్టర్ సేవా కేంద్రానికి వెళ్లింది.
అక్కడికి ఆమెతోపాటు చాలా మంది వచ్చారు. దీంతో తన వంతు రావడం కోసం ఆమె క్యూలైన్ లో నిల్చుంది. సదరు మహిళ గర్బిణి కావడంతో.. క్యూ లైన్ లో ఉన్నప్పుడే ఆమెకు నొప్పులు రావడం మొదలయ్యాయి.
దీంతో.. అక్కడ ఉన్న కొందరు మహిళలు ఆమెకు సహాయం చేశారు. దీంతో.. సదరు మహిళకే అక్కడే ప్రసవించింది. గతేడాది అస్సాంలో దాదాపు 40లక్షల మంది పేర్లను జనాభా లెక్కల్లో నుంచి తొలగించారు. దీంతో వారంతా మళ్లీ పేరు ఎక్కించుకునేందుకు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.