మిజోరం రాష్ట్రంలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో గత కొన్నేళ్లలో ఎప్పుడు లేనంత పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను అస్సాం రైఫిల్స్ ఆదివారం స్వాధీనం చేసుకుంది. ఈ ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం 23 సెక్టార్ అస్సాం రైఫిల్స్కు చెందిన ఐజ్వాల్ బెటాలియన్ కెల్సిహ్ గ్రామ సమీపంలో వాహనాలను అడ్డగించింది. అలాగే ఈ ఆపరేషన్ లో నలుగురిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిలో మూడు తుపాకులు, ఐదు రైఫిళ్లు, 3,000 కిలోల జిలాటిన్ స్టిక్స్, 100 కిలోల గన్పౌడర్, 44 కిలోల సేఫ్టీ ఫ్యూజ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని ఉపయోగించి రాష్ట్రంలో అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉండేదని అస్సాం రైఫిల్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నాలుగు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లతో 1,643 కి.మీ పొడవైన కంచె లేని అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే మయన్మార్ నుండి ఈ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అక్రమంగా రవాణా అయి వచ్చినట్టు నిఘా, భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో మావోయిస్టుల నెట్వర్క్ను విస్తరించడానికి సంబంధించి, జాతీయ దర్యాప్తు సంస్థ అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో రెండు చోట్ల దాడులు చేసింది
