Drugs Seized : మిజోరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.8 కోట్లపైనే విలువ చేసే హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు అసోం రైఫిల్స్ పారామిలటరీ దళం మంగళవారం తెలిపింది.
Drugs Seize: మాదకద్రవ్యాలు(డ్రగ్స్) అక్రమరవాణాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకవచ్చిన.. స్మగ్లర్లు రోజురోజు కొత్త పద్దతిలో అక్రమ రవాణా చేస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. తాజాగా మిజోరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కలకలం రేపింది. పలు ఘటనల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.8 కోట్లపైనే విలువ చేసే హెరాయిన్ను పోలీసులు సీజ్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. ఇండో-మయన్మార్ సరిహద్దులోని మిజోరంలోని చంపాయ్ జిల్లాలో అస్సాం రైఫిల్స్కు చెందిన సెర్చిప్ బెటాలియన్ సైనికులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 751.2 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.రికవరీ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. అలాగే.. ఐజ్వాల్కు సమీపంలో 107 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మిజోరం నార్కోటిక్స్ విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు, మిజోరం ఎక్సైజ్ మరియు నార్కోటిక్స్ విభాగం నిర్వహించిన సోదాల్లో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో నుండి రూ.14 లక్షల విలువైన 503 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది మరియు ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసింది. ఈ ఘటనలో నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు
అలాగే.. జోఖౌతార్ గ్రామంలో మంగళవారం రూ.5.23 కోట్ల విలువైన 1.3 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిందితులు సబ్బు పెట్టెల్లో హెరాయిన్ను అక్రమంగా తరలిస్తున్నారని వెల్లడించారు. మయన్మార్ నుంచి హెరాయిన్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ డ్రగ్స్ కలకలం రేపింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. నగర శివారులో ఉన్న ఓ గోడౌన్లో మెథా పాటెమిన్ అనే డ్రగ్ తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పక్క సమాచారం మేరకు ఆ గోడౌన్ పై దాడి చేసి., విజయ్, వెంకటరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు కేంద్రంగా ఈ డ్రగ్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటూ ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రి చెన్నై పోలీసులు దాడిచేసి ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ డ్రగ్ని గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
