Assam Floods: అసోం భారీ వర్షాలు కురుస్తుండటంలో వరదలు పొటెత్తాయి. దీంతో వరద కారణంగా ప్రభావితం అవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు అసోంలో మరణించిన వారి సంఖ్య 173కు పెరిగింది.
Assam Floods: ఈశాన్య భారతంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రభావితమయ్యారు. వందల మది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సహాయక శిబిరాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికీ అసోంలో వరదల పరిస్ధితులు భయానకంగా ఉన్నాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో కొత్తగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారని అసోం అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 173కి చేరుకుంది. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటికీ పరిస్థితులు దారుణంగానే ఉండటంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా పరిస్థితుల గురించి అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికీ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా సంభవించిన 15 మరణాల్లో అధికంగా కాచర్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. ఆ తర్వాత నాగోన్ లో ముగ్గురు ప్రణాలు కోల్పోయారు. బార్పేటలో ఇద్దరు, కరీంగంజ్, కోక్రాజార్, లఖింపూర్లో ఒక్కొక్కరు వరదల కారణంగా మరణించారని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. ఇంకా భారీ వర్షలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని తెలిపారు. బ్రహ్మపుత్ర, బెకి, కొపిలి, బరాక్, కుషియారా నదులు ఇంకా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి.. ఆయా పరిస్థితులను తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రజలు ఆహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. తమను ఆదుకోవాలంటూ వెడుకుంటున్న ప్లకార్డులు ప్రదర్శించిన పలు ఫొటోలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
