Assam Floods: అసోంను ముంచెత్తుతున్న వరదలు.. మరో నలుగురు మృతి
Assam Floods: భారీ వర్షం, వరదల నేపథ్యంలో 74,907 మంది వరద బాధితులు 282 సహాయ శిబిరాల్లో తలదాచుకోగా, మరో 214 సహాయ పంపిణీ కేంద్రాలు బాధితుల కోసం పని చేస్తున్నాయి.
18 killed in Assam floods: ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మరీముఖ్యంగా అసోంలో వరదల ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికీ కొనసాగుతున్న భారీ వర్షం, వరదల కారణంగా మరో నలుగురు మరణించారు. దీంతో అసోం వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. అలాగే, వదల ప్రబావిత జిల్లాల సంఖ్య సైతం 32కు చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వరదల కారణంగా లక్షలాది మంది ప్రభావితమయ్యారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అయితే, విపత్తు బారిన పడిన వారి సంఖ్య స్వల్పంగా 6,80,118 లక్షలకు తగ్గిందని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) తెలిపింది. శుక్రవారం నాటికి, బాధిత జనాభా సంఖ్య 29 జిల్లాలలో 7,11,905గా ఉంది. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) శనివారం అందించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో దాదాపు 8.40 లక్షల మంది ప్రజలు వరదల కారణంగా ప్రభావితమయ్యారు. అలాగే, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాడు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ASDMA బులెటిన్ ప్రకారం.. 3.39 లక్షల మంది ప్రజలు ప్రభావితమైన వారితో నాగావ్ అత్యంత దెబ్బతిన్న జిల్లాగా మిగిలిపోయింది. ఆ తరువాతి స్థానాల్లో కాచర్ (1.77 లక్షలు), హోజాయ్ (70,233) లు ఉన్నాయి. 74,907 మంది వరద బాధితులు 282 సహాయ శిబిరాల్లో తలదాచుకోగా, మరో 214 సహాయ పంపిణీ కేంద్రాలు బాధితుల కోసం పనిచేస్తున్నాయి.
నివేదిక ప్రకారం 100,000 హెక్టార్ల పంట భూములు వరదల కారణంగా నీట మునిగాయి. అలాగే, 3,246 గ్రామాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, శిక్షణ పొందిన వాలంటరీ టీమ్లు, వివిధ ఏజెన్సీలు రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్నాయి. ప్రభావిత జిల్లాలలో ఉన్న దిమా హసావో ప్రధాన కార్యాలయం హఫ్లాంగ్ నుండి వచ్చిన నివేదిక.. అసోంలోని జిల్లాలోని అన్ని ప్రాంతాలకు కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. లుమ్డింగ్-బాదర్పూర్ హిల్ సెక్షన్లోని వివిధ ప్రదేశాలలో నీటి ఎద్దడి మరియు కొండచరియలు విరిగిపడటంతో డజన్ల సంఖ్యలో రైళ్లను రద్దు చేసినట్టు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే వెల్లడించింది. ట్రాక్లు దెబ్బతినడం, వివిధ ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఇక్కడ రైలు సేవలు వారం రోజులుగా నిలిచిపోయాయి.
ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల నుండి కట్టలు, రోడ్లు, వంతెనలు, ఇళ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం నివేదించబడుతూనే ఉందని ASDMA బులెటిన్ తెలిపింది. సమీక్షా సమావేశంలో, దీమా హసావో జిల్లాలోని జటింగా మరియు హరంగాజావో మధ్య ఉన్న రహదారిని వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చీఫ్ సెక్రటరీ జిష్ణు బారువాకు హామీ ఇచ్చారు. బాధిత ప్రజలకు ఉచిత సహాయాన్ని అందించడం కోసం హోజై జిల్లాకు అదనంగా ₹ 3 కోట్లు కేటాయించినట్లు ASDMA తెలిపింది. సహాయక చర్యలను మరింతగా ముమ్మరం చేస్తున్నట్టు వెల్లడించింది.