అసోం ముఖ్యమంత్రి  హిమంత బిస్వా శర్మ వామపక్షాలపై విరుచుకుపడ్డారు - చరిత్రను తిరగరాసే సమయం ఆసన్నమైందని అన్నారు. వామపక్షాలు మన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వామపక్షాలపై విరుచుకుపడ్డారు. వామపక్ష చరిత్రకారులు భారతీయ చరిత్రను ఓటమి , లొంగుబాటు కథగా వక్రీకరించారని ఆరోపించారు . దేశం యొక్క విజయాన్ని నమోదు చేయడానికి చరిత్రను తిరిగి వ్రాయాలని అన్నారు. వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు దశాబ్దాలుగా రాష్టాలను భాషా ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చరిత్రను వక్రీకరించేందుకు వామపక్షాలు ప్రయత్నం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 28వ రాష్ట్ర సదస్సులో ప్రసంగించిన శర్మ మాట్లాడుతూ.. వామపక్షాలు భారత్‌ను ఓడిపోయిన సమాజంగా ప్రదర్శించాలని కోరుతున్నందున మన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. మొఘలుల దాడులను ధైర్యంగా ఎదుర్కొని ఓడించిన రాజులను, వీరులను విస్మరించారని పేర్కొన్నారు. చరిత్రలో మొఘలులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయనీ, ఆ విజయ కథలను విస్మరించారని అన్నారు. వామపక్ష చరిత్రకారులు ఓడిపోయిన వారి గురించే రాశారని సీఎం అన్నారు. మొఘల్ దళాలకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడిన గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ, దుర్గా దాస్ రాథోడ్, లచిత్ బోర్ఫుకాన్‌ల గాథాలను సీఎంశర్మ ఉదహరించారు. వామపక్ష చరిత్రకారులు చరిత్రను రాసేటప్పుడు తమ దోపిడీని విరమించుకోలేదని శర్మ ఆరోపించారు.

చరిత్రను తిరగరాసే సమయం ఆసన్నమైంది

చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓటమి, దాస్యం కథలు కాదని, కీర్తి, సాఫల్య కథనాలను తిరగరాసేలా చరిత్ర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలన్నారు. ఇది మన కొత్త తరానికి దేశ నిర్మాణం వైపు వెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందనీ, రాష్ట్రంలో అనేక భాషలు మాట్లాడుతున్నందున వామపక్ష మేధావులు అసోం ప్రజలను భాషా ప్రాతిపదికన విభజించారని ఆరోపించారు. భాష అనేది ఒక ముఖ్యమైన అంశమని, అయితే అది ఏ సమాజానికైనా, మతానికైనా ఏకైక గుర్తింపు కాదన్నారు. చరిత్ర కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనీ, మన మతం, సంస్కృతి బతికినప్పుడే భాష బతుకుతుందని అన్నారు.

ఆర్థిక స్వావలంబన అవసరం

యువత స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యవసాయంపై దృష్టి సారించాలని అన్నారు. ఒక సమాజానికి సాంస్కృతిక గుర్తింపు , రాజకీయ అహంకారం అవసరం కానీ మనం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోతే మనం స్వయం సమృద్ధి పొందలేమని అన్నారు.యువత తమ భూమిని ఇతరులకు సాగుకు ఇవ్వకుండా ప్రగతిశీల సేద్యం చేపట్టాలన్నారు. అస్సాం, ఈశాన్య ప్రాంతాలు చారిత్రాత్మకంగా మిగిలిన భారతదేశంతో సంబంధం కలిగి లేవనే అభిప్రాయం తప్పుగా సృష్టించబడిందని శర్మ అన్నారు. దీనివల్ల స్వాతంత్య్రానంతరం ఈ ప్రాంతంలో భిన్నమైన భావజాలం పుట్టిందని అన్నారు.