మేఘాలయ సరిహద్దు కాల్పులపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన అస్సాం సీఎం.. రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
Meghalaya Border Firing: మేఘాలయ సరిహద్దుల్లో ఆరుగురి మృతికి కారణమైన కాల్పుల ఘటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ న్యాయ విచారణకు ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Assam CM Himanta Biswa Sarma: పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో అస్సాం-మేఘాలయ సరిహద్దులో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురి మృతికి కారణమైన ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల్లో ఫారెస్ట్ గార్డు కూడా ఉన్నాడు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
వివరాల్లోకెళ్తే.. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో (వెస్ట్ జైంతియా హిల్స్) అస్సాం-మేఘాలయ సరిహద్దులో అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో జరిగిన హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మరణించారు. తెల్లవారుజామున 3 గంటలకు ముక్రు ప్రాంతంలో అటవీ బృందం ట్రక్కును ఆపడంతో, డ్రైవర్ వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫారెస్ట్ గార్డులు కాల్పులు జరిపి లారీ టైర్ను కాల్చారు. డ్రైవర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ మరికొందరు తప్పించుకోగలిగారు. అయితే, కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వారనీ, ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ గార్డు అస్సాంకు చెందినవారని మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తెలిపారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. మేఘాలయ కూడా ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఘటన తర్వాత ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 48 గంటలపాటు నిలిపివేశారు. పశ్చిమ జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి-భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్ & సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాల్లో ఇంటరెట్ నిలిపివేయబడింది.
మృతుల కుటుంబాలకు అస్సాం సర్కారు ఆర్థిక సాయం..
మేఘాలయ సరిహద్దుల్లో ఆరుగురి మృతికి కారణమైన కాల్పుల ఘటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ న్యాయ విచారణకు ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్లో ఉన్న సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ: “మేము న్యాయ విచారణకు ఆదేశించాము.. ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించాము. ఎస్పీని బదిలీ చేయడంతోపాటు స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు సస్పెన్షన్కు గురయ్యారని తెలిపారు.