Asianet News TeluguAsianet News Telugu

Top Ten News:  టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన..  తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా.. త్వరలో బెల్ట్ షాపులు క్లోజ్…!

Top Ten News: టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాళన   దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.  ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Asianet News Telugu Top Ten news KRJ
Author
First Published Dec 13, 2023, 7:03 AM IST

1. CM Revanth reddy: టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాళన   దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.  ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సితోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీపై మంగళవారం సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసులు ఉన్నతాధికారులు, కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.  

2. TSPSC: టీఎస్‌పీఎస్‌సీలో ఏం జరుగుతోంది? 

TSPSC: తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ హాట్ టాపిక్ మారింది. నిన్న టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం ఒకవైపు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేస్తున్నదని మరో వార్త రావడం వంటివి ఈ విషయాలను మరింత సస్పెన్స్‌గా మార్చేశాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు TSPSCకి చెందిన ఇంకో కీలక అధికారి రాజీనామా చేశారు. ఆర్ సత్యనారాయణతోపాటు మరో నలుగు బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేశారు. బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారెం రవీంద్ర రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు.

3. TSGENCO: తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఓ పోటీ పరీక్ష వాయిదా పడింది. అయితే.. దీనికి పేపర్ లీక్‌లు, లేదా కోర్టు ఆదేశాలో కారణంగా లేవు. అభ్యర్థుల విన్నపం మేరకే ఈ వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 17న ఇతర పరీక్షలు ఉన్నందున జెన్‌ కో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ జెన్‌ కో వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్‌ జెన్‌ కో తెలిపింది. అక్టోబర్ 4వ తేదీన టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్), కెమిస్ట్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వచ్చాయి.

4. SA vs IND 2nd T20: టీమిండియాపై సౌతాఫ్రికా విజయం 

IND vs SA 2nd T20I: భారత్‌తో జరిగిన రెండో టీ20లో  భారత్‌ను దక్షిణాఫ్రికా ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత  రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ల హాఫ్‌ సెంచరీలతో భారత్‌ 19.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఆపై అకస్మాత్తుగా వర్షం రావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు. ఈ టార్గెట్‌ని సఫారీలు ఏడు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. 

5. Belt Shops: త్వరలో బెల్ట్ షాపులు క్లోజ్…!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు బెల్ట్ షాపులపై సంచలన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని బెల్ట్ షాపులను మూసేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టూ సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూసివేతకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖ బెల్ట్ షాపులపై రైడ్లు చేస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దూకినట్టు సమాచారం.

6. తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట

తెలంగాణలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ సీపీలను మార్చారు. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబులను నియమించారు. గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన సందీప్ శాండిల్యను యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా నియమించారు. పోలీసు శాఖలో మరిన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. 

7. Bhajan Lal Sharma:రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్.

రాజస్థాన్‌లో రాజకీయ ఉత్కంఠకు పూర్తిగా తెరపడింది. రాజస్థాన్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్‌ల పేర్లను ప్రకటించడంతో తెర చాటు రాజకీయాలకు బ్రేక్ పడింది. అయితే.. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజస్తాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ పేరు చర్చకు వచ్చింది. వాస్తవానికి చాలా మంది సీఎం పదవి రేసులో ఎంతో మంది ఉన్న బీజేపీ భజన్ లాల్ శర్మ పేరును ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ కొత్త పేర్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది  బీజేపీ అధిష్టానం.

8. Holidays list: వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ సెల‌వుల జాబితా ఇదే..

Holidays list: 2024 ఏడాదికి గాను సాధారణ, ఐచ్చిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్చిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. KCR: నన్ను చూసేందుకు రావొద్దు.. కేసీఆర్‌ విజ్ఞప్తి

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాత్‌రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కారణంగా ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించేందుకు పెద్ద ఎత్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులు, రాష్ట్ర ప్రజలు యశోదా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వారి కేసీఆర్  విజ్ఞప్తి చేశారు. తనను చూసేందుకు యశోదా ఆసుపత్రికి రావొద్దని కేసీఆర్ కోరారు. తనతో పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకుండా వుండేందుకే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

10. ఏపీ ఫైబర్‌నెట్ స్కాం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..  

ఇప్పటికే బెయిల్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో సమస్య వచ్చి పడింది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. అలాగే కేసు విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబుకు కూడా సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios