పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం తన సత్తాను చాటలేకపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎంఐఎం ఖాతా కూడా తెరవలేకపోయింది.

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పూర్తిగా విఫలమైంది. బీహార్ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో విఫలమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎంఐఎం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పశ్చిమ బెంగాల్ లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో విఫలమైన ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఏడు సీట్లకు, తమిళనాడులో మూడు సీట్లకు ఎంఐఎం పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఇతహార్, జలంగి, సాగర్ధిఘి, భరత్ పూర్, మలతిపూర్, రటువ, అసన్ సోల్ నార్త్ అసెంబ్లీ స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ముస్లిం ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటారు. అయితే, ఒక్కరు కూడ విజయం సాధించలేకపోయారు. 

తమిళనాడులో దినకరన్ నాయకత్వంలోని అమ్మ మక్కల్ మున్నేత్ర కజగమ్ (ఎఎంఎంకె)తో ఎంఐఎం పొత్తు పెట్టుకుది. వనియబడి, కృష్ణగిరి, శంకరపురం నియోజకవర్గాల్లో అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించారు. అయితే, ఎంఐఎం ఖాతా తెరవడంలో విఫలమైంది.

బీహార్ లో మాదిరిగా అసదుద్దీన్ ఓవైసీ తమకు పశ్చిమ బెంగాలో ఉపయోగపడుతారని బిజెపి ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. బిజెపికి సాయం చేయడానికే ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తోందని ఆమె విమర్శించారు. అయితే, బీహార్ లో మాదిరిగా పశ్చిమ బెంగాల్ లో ఎంఐఎం తన సత్తా చాటలేకపోయింది. బీహార్ లో ఫ్రంట్ కట్టి పోటీ చేయడం బిజెపి కూటమికి లాభించిందనే విశ్లేషణలు సాగాయి.