బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసులో ఓ కీలక పరిణామం ఎదురైంది. ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీ పంచనామాలో విట్నెస్గా పేరున్న ప్రభాకర్ సాయిల్ గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన మరణంపై కుటుంబం కూడా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఇతర అనుమానాలనూ ప్రకటించలేదని ప్రభాకర్ సాయిల్ తరఫు న్యాయవాది ఖండారే తెలిపారు. ఆర్యన్ ఖాన్పై కేసు పెట్టకుండా ఉండటానికి ఓ డీల్ మాట్లాడిన వ్యవహారం ఉన్నదని ప్రభాకర్ సాయిల్ ఆరోపించి సంచలనం చేసిన సంగతి తెలిసిందే.
ముంబయి: గతేడాది అక్టోబర్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఆర్యన్ ఖాన్ కేసు. ఓ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆయన నిందితుడిగా చేర్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడే ఆర్యన్ ఖాన్ కావడంతో ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు.. కోర్టులో వాదనలు, చివరకు బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్కు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసే వరకూ ప్రతి రోజూ ఉత్కంఠగా సాగింది. అక్టోబర్ 30న ఆర్యన్ ఖాన్ చివరగా జైలు నుంచి అడుగు బయట పెట్టాడు. ఆ తర్వాత ఈ కేసు చుట్టూ రాజకీయాలు జరిగాయి. కానీ, అంతగా చర్చలోకి రాలేదు. తాజాగా, ఈ కేసులో ఓ కీలక పరిణామం ఎదురైంది.
ఆర్యన్ ఖాన్ కేసుకు సంబంధించి ఎన్సీబీ పంచనామాలో సాక్షి ప్రభాకర్ సాయిల్ శుక్రవారం మధ్యాహ్నం మరణించారు. ముంబయిలోని మాహుల్ ఏరియాలో తాను అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్లో గుండె పోటుతో మరణించినట్టు ఆయన తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. కాగా, ఆయన మరణంలో కుటుంబానికీ ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ప్రభాకర్ సాయిల్ తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ అపార్ట్మెంట్లో నివసించారు. ప్రభాకర్ సాయిల్ మృతదేహాన్ని ఆయన సోదరులు వచ్చిన తర్వాతే అంతిమ క్రియలు నిర్వహించాలని ఆపారు.
ఎన్సీబీ పంచనామాలో స్వతంత్ర సాక్షిగా పేరున్న ప్రభాకర్ సాయిల్ కొన్ని నాటకీయ పరిణామాల్లో రివర్స్ గేర్ వేశారు. అంటే, తాను అసలు సాక్షిగా లేనని, బ్లాంక్ పేపర్లపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, ఈ కేసును పెట్టకుండా ఉండటానికి అప్పటి ఎన్సీబీ ముంబయి జోనల్ చీఫ్ వాంఖడే డబ్బులు తీసుకునే పథకం వేశారని ఆరోపణలు చేశారు. ఇందుకోసం ప్రైవేటు డిటెక్టివ్ గోసావితో ఆ వ్యవహారం నడిపించారని పేర్కొన్నారు.
ఆర్యన్ ఖాన్ అరెస్టు సమయంలో గోసావి.. ఆయనతో సమీపంగా ఉండి తీసుకున్న సెల్ఫీ ఒకటి వైరల్ అయింది. ఎన్సీబీ కార్యాలయానికి ఆర్యన్ ఖాన్ను తీసుకెళ్లుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గోసావి పాత్రపై దుమారం రేగింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆయన పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతూ వాంఖడేపైనా దుమ్మెత్తిపోశారు. ప్రభాకర్ సాయిల్.. గోసావి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పని చేశారు.
ఇదిలా ఉండగా, షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన ఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో రూమార్లు తెగ హల్ చల్ చేస్తున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ సినిమా నిర్మాణంలో ఉన్న సృజనాత్మకత గురించి తరచుగా మాట్లాడుతూ ఉండే వాడు. దీంతో ఖాన్ వారసుడు చిత్రనిర్మాతగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని, నటనపై ఆసక్తి లేదని పలువురు సీని వర్గీలు అభిప్రాయపడ్డారు. ఆ అంచనాను నిజం చేస్తూ ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ (Bollywood) ఎంట్రీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. అయితే నటుడిగా మాత్రం ఎంట్రీ ఇచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది.
