Arvind Panagariya: శ్రీలంక ఆర్థిక పరిస్థితిని భారత్‌తో పోల్చడం మూర్ఖత్వమేన‌నీ, కానీ.. ఈ ద్వీప దేశ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి కొన్ని గుణ‌ పాఠాలు నేర్చుకోవాల‌ని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మెన్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు

Arvind Panagariya: భారతదేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను శ్రీ‌లంకతో పోల్చడం మూర్ఖత్వమేన‌నీ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అభిప్రాయపడ్డారు. అయితే.. ద్వీప దేశం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుండి మనం క‌చ్చితంగా కొన్ని గుణ‌ పాఠాలు నేర్చుకోవాల‌ని అన్నారు. 1991 లో భారత్‌ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం తర్వాత.. దేశంలో ఆర్థిక వ్యవస్థ( ఆర్థిక లోటు) చేదాటిపోకుండా చూసుకుంటున్నామని పనగారియా అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భారతదేశానికి సంబంధించినంత వరకు ఆర్థిక లోటును బయటికి వెళ్లనివ్వలేదన్నారు. ఈ క్ర‌మంలో కరెంటు ఖాతా లోటును తగ్గించడానికి, మారకపు రేట్లు తగ్గించడానికి అనుమతించబడిందనీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్ర‌భుత్వం ద్రవ్య విధాన చర్యలు తీసుకుంటుంద‌ని తెలిపారు. భారత్, శ్రీలంకలను పోల్చడం నిజంగా నవ్వు తెప్పిస్తోందని పనగారియా అన్నారు. భార‌త్ తన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి విదేశాల నుండి రుణాలు తీసుకోలేదని స్ప‌ష్టం చేశారు. అదే సమయంలో భారతదేశం తన పొరుగు దేశానికి చురుకుగా సహాయం చేస్తోందనీ తెలిపారు. 

నిరుద్యోగ సమస్యపై పనగారియా మాట్లాడుతూ.. భారతదేశ సమస్య నిరుద్యోగం కాదని, అర్హతకు తగిన వేతనాలు లేకపోవడం, తక్కువ ఉపాధి లేదా తక్కువ ఉత్పాదకత కలిగిన ఉపాధి ఉండ‌ట‌మే ప్ర‌ధాన స‌మ‌స్య అని అన్నారు. ప్రజలు మంచి ఆదాయాన్ని పొందగలిగే ఉద్యోగాల కల్పనపై ప్ర‌భుత్వం దృష్టి సారించాలనీ, కోవిడ్ లాక్ డౌన్ కాలంలోనూ భారతదేశంలో నిరుద్యోగం రేటు 4.2 శాతం మాత్రమే, ఇది 2017-18లో 6.1 శాతం కంటే తక్కువ అని అన్నారు.

అధికారిక ఆర్థిక డేటాను ప్రశ్నిస్తున్న కొంతమంది నిపుణుల సమస్యపై పనగారియా మాట్లాడుతూ.. దేశ జిడిపి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్), ఇతర గణాంకాలను అంతర్జాతీయ పోలిక కంటే మెరుగ్గా కనిపిస్తున్నాయని అన్నారు. కొన్ని విమర్శల్లో నిజం ఉందని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో పాటు కొందరు దురుద్దేశంతో చేస్తున్న విమర్శలను ఉపేక్షించబోమన్నారు. 

 ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. భారతదేశంలో చాలా వరకు శ్రీలంక లాగా ఉందని, ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించకూడదని అన్నారు. త్వ‌ర‌లో భార‌త్ కూడా శ్రీలంక లాగా సంక్షోభం ఎదుర్కొంటుంద‌ని విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పనగరియా తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.