జయలలిత మృతిపై విచారణ జరపాల్సిందే.. శశికళపై బాంబు పేల్చిన ఆరుముగసామి కమిషన్ రిపోర్ట్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం.. జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ నివేదికను నేడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం.. జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ నివేదికను నేడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. జయలలిత ఆసుపత్రిలో చేరడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలపై ఆరుముగసామి కమిషన్ రిపోర్ట్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతితెలిసిందే. ఈ నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. జయలలిత చికిత్స విషయంలో నిజానిజాలు తెలియాలంటే విచారణ అవసరమని కమిషన్ తెలిపింది. జయలలిత సహాయకురాలు శశికళ, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ జె రాధాకృష్ణన్, డాక్టర్ సి శివకుమార్లపై విచారణకు సిఫార్సు చేసింది.
జయలలిత 2016 డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య మరణించారని సాక్షులు చెప్పినట్టుగా ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొంది. అయితే జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మరణించినట్లు అపోలో ఆసుపత్రి ప్రకటించింది. జయలలిత డిసెంబరు 4న మరణించారని.. డిసెంబర్ 5న ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయని నివేదిక పేర్కొంది. దీంతో జయలలిత మరణాన్ని ప్రకటించడంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే.. 2016 సెప్టెంబరు 22న జయలలితను ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. జయలలిత ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన తర్వాత జరిగిన అన్ని సంఘటనలను శశికళ గోప్యంగా ఉంచారని నివేదికలో పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వెంటనే జయలలిత మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించి ప్రథమ చికిత్స చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అపస్మారక స్థితిలో ఉన్న జయలలితను అంబులెన్స్లో అపోలో ఆసుపత్రికి తరలించి ఇన్పేషెంట్గా చేర్చారు.
ప్రాథమిక రోగ నిర్ధారణ తర్వాత అతన్ని ఐసీయూకు తరలించారు. అక్కడ స్ట్రెచర్పై ఉన్న జయలలిత.. తిరిగి స్పృహలోకి వచ్చారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ బంధువులు అక్కడి గదులను ఆక్రమించారని కూడా నివేదిక పేర్కొంది. ఇక, 2012లో జయలలిత, శశికళ మళ్లీ కలిసిన తర్వాత వారి మధ్య సంబంధాలు సజావుగా లేవని నివేదిక పేర్కొంది.
చివరి శ్వాస వరకు జరగని యాంజియో సర్జరీ..
నివేదిక ప్రకారం.. జయలలితకు ఊబకాయం, అధిక రక్తపోటు, అనియంత్రిత మధుమేహం, హైపోథైరాయిడిజం, దీర్ఘకాలిక డయేరియా మరియు క్రానిక్ బ్రోన్కైటిస్తో కూడిన ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నాయి. బ్రిటీష్ వైద్యుడు రిచర్డ్ పీలే సహా పలువురు.. జయలలితకు యాంజియో సర్జరీని సిఫార్సు చేశారు. అయితే ఆమెకు యంజియో సర్జరీ ఎందుకు నిర్వహించలేదనే దానిపై ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇక, జయలలిత మరణం తర్వాత వెలువడ్డ అనేక అనుమానాల నేపథ్యంలో మాజీ సీఎం ఓ పనీర్సెల్వం ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి కారణంగా జయలలిత మరణాన్ని దర్యాప్తు చేయడానికి ఆరుముగస్వామి కమిషన్ ఏర్పడింది. 2017 నవంబర్లో ఈ కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. జయలలితకు వైద్యం అందించిన వైద్యులు, అప్పటి అధికారులు, మంత్రులు, లీడర్లు, ఇతరుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకుంది. ఈ రిపోర్టును ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన జస్టిస్ ఆరుముగస్వామి.. 150 మంది సాక్షులను విచారించిన తర్వాత ఇంగ్లిష్లో 500 పేజీలు, తమిళంలో 608 పేజీల నివేదికను సిద్ధం చేశామన్నారు. నివేదికను ప్రచురించడంపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని, సంబంధిత అన్ని అంశాలను నివేదికలో పేర్కొన్నట్లుగా చెప్పారు.
ఆరుముగస్వామి కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించిన సీఎం స్టాలిన్ నేతృత్వంలోని మంత్రివర్గం.. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తర్వాత తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదికతో పాటు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదికను శాసనసభ ముందుంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇదిలా ఉంటే.. జయలలిత మృతిపై విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో.. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నందున తాను అధికారంలోకి రాగానే డీఎంకే ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇక, అనారోగ్య కారణాలతో 75 రోజులు ఆస్పత్రిలో ఉన్న జయలలిత 2016 డిసెంబర్ 5న మరణించినట్టుగా అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జయలలిత అనారోగ్యం బారినపడినప్పటి నుంచి ఆమె తుదిశ్వాస విడిచేవరకు చోటుచేసుకున్న పరిణామాలపై తమిళ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.