జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్దరించబడుతుంది: మెహబూబా ముఫ్తీ
JammuKashmir: జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించబోనని గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే ఈ నిబంధనను పునరుద్ధరించగలదని తెలిపారు.
Mehbooba Mufti: జమ్మూకాశ్మీర్ కు సంబంధించి 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370లోని నిబంధనలను పునరుద్ధరించబడుతాయని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆదివారం నాడు జమ్మూకాశ్మీర్ లో కొనసాగిన ఒక ర్యాలీలో ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ ముఫ్తీ పై వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ.. "ఆర్టికల్ 370పై అది ఆయన (ఆజాద్) వ్యక్తిగత అభిప్రాయం…కాంగ్రెస్ బ్రిటిష్ వారిపై తన స్వరాన్ని పెంచింది. వారికి వ్యతిరేకంగా పోరాడి.. వారి చర్యలను.. వారిని అడ్డుకుంది. అదేవిధంగా, జమ్మూకాశ్మీర్ లో రద్దు చేయబడిన ఆర్టికల్ 370 పునరుద్ధరించబడుతుందనీ, ఈ అంశంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించబడుతాయని" ఆమె అన్నారు. "జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 పునరుద్దరించబడుతుంది. అన్ని సమస్యలు పరిష్కరించబడుతాయని విశ్వసించే గొంతుకలు ఇక్కడ ఉన్నాయి" అని ముఫ్తీ తెలిపారు.
కాగా, అంతుకముందు జమ్మూకాశ్మీర్ లో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించబోమని పేర్కొన్నారు. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్న ప్రభుత్వం మాత్రమే ఈ నిబంధనను పునరుద్ధరించగలదని చెప్పారు. “ఏమి చేయవచ్చో, ఏమి చేయలేదో ఆజాద్కు తెలుసు. నేను లేదా కాంగ్రెస్ పార్టీ లేదా మూడు ప్రాంతీయ పార్టీలు మీకు ఆర్టికల్ 370ని తిరిగి ఇవ్వలేవు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ చీఫ్), డీఎంకే లేదా శరద్ పవార్ (ఎన్సీపీ చీఫ్) కూడా మీకు తిరిగి ఇవ్వలేరు” అని పేర్కొన్నారు. తాను తనకు నియంత్రణ లేని అంశాలను లేవనెత్తబోనని తెలిపారు.
"నేను ఆర్టికల్ 370 గురించి మాట్లాడనని కొందరు అంటున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం గులాం నబీ ఆజాద్ ప్రజలను మోసం చేయరని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను" అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉత్తరాదిలోని డాక్ బంగ్లా బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. “నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించనని దేవుని ముందు ప్రమాణం చేస్తున్నాను. నాకు నియంత్రణ లేని అటువంటి నినాదాలు లేదా సమస్యలను నేను లేవనెత్తను”అని అన్నారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న పార్టీ మాత్రమే 2019 ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పునరుద్ధరించగలదని ఆజాద్ అన్నారు. అయితే, "గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 85 లోక్సభ స్థానాలకు మించి సాధించలేకపోయింది. ప్రతి రాష్ట్రం నష్టంతో రాజ్యసభలో దాని బలం తగ్గుతోంది… 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 350 సీట్లకు పైగా వస్తాయని నేను అనుకోవడం లేదు" అని తెలిపారు.
“నేను లేదా కాంగ్రెస్ పార్టీ లేదా మూడు ప్రాంతీయ పార్టీలు మీకు ఆర్టికల్ 370ని తిరిగి ఇవ్వలేవు…” అని ఆజాద్ పేర్కొన్నారు. గత నెలలో కాంగ్రెస్తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ముగించిన ఆజాద్, 10 రోజుల్లో తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తాననీ, దాని సిద్ధాంతాలు స్వతంత్రంగా ఉంటాయని తెలిపారు. రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడైన ఆయన జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, ఉద్యోగాలు, ఈ ప్రాంతంపై తన ప్రజలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడం, అభివృద్ధిని తీసుకురావడంపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా ఆజాద్ ఓటు వేశారని అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ, పార్లమెంట్ ఎలా పనిచేస్తుందో ముందుగా బుఖారీ అర్థం చేసుకోవాలని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు కోసం హోం మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా తాను ఓటు వేశానని గులాంనబీ ఆజాద్ తెలిపారు.