పాక్ ముష్కరులను మట్టుబెట్టిన భారత ఆర్మీ.. చైనా రైఫిల్స్ స్వాధీనం
జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్ కమల్ కోట్ లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఎన్కౌంటర్లో చైనా రైఫిల్ స్వాధీనం చేసుకుంది.
సరిహద్దు వెంబడి డ్రాగన్ దేశం, పాక్ చేస్తున్న ఉగ్ర కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఎలాగైనా భారత సరిహద్దులోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఇటీవల ఉగ్రవాద సంస్థల ప్రోద్భలంతో భారత్ లో దాడులు చేయడానికి ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని రష్యాలో అదుపులోకి తీసుకోగా.. తాజాగా జమ్మూ కశ్మీర్ ఉరీలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి)లో చొరబాటుకు యత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చొరబాట్లను భారత ఆర్మీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భద్రత బలాగాలు ఆ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్మీ మీడియాకి విడుదల చేసింది. ఆ చొరబాటుదారుల నుంచి చైనాలో తయారు చేసిన చైనా M-16 అసాల్ట్ రైఫిల్ను నుంచి సైనికులు స్వాధీనం చేసుకున్నారు.
ఉరీలోని కమల్కోట్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించి హతమైన పాక్ ఉగ్రవాదుల నుంచి ఏకే సిరీస్కు చెందిన రెండు ఆయుధాలు, ఒక చైనీస్ ఎమ్-16 అసాల్ట్ రైఫిల్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ తెలిపింది. ఈ రికవరీ అసాధారణమని సైన్యం అభివర్ణించింది.
ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా మేజర్ జనరల్ అజయ్ చంద్పురి మాట్లాడుతూ.. సాధారణంగా సైన్యంలో ఉపయోగించడానికి AK సిరీస్ ఆయుధాలు ఇస్తారు. చాలా అరుదుగా.. M-16 రైఫిల్స్ స్వాధీనం చేసుకుంటారు. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న ఈ M-16 చైనాలో తయారు చేయబడినవి. ఇది పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు, చైనా సైన్యం మధ్య బంధానికి సంకేతమని తెలుస్తుంది " అని ఆయన అన్నారు. అలాగే.. సరిహద్దులో రికార్డ్ అయినా పుటేజ్ ల ఆధారంగా దాదాపు 100-120 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ నుండి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
ఈ ఉగ్రవాదులు అక్కడ 15-20 లాంచ్ప్యాడ్లను తయారు చేసినట్టు తెలుస్తుందనీ, ఇవి కూడా నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ.. లాంచ్ప్యాడ్లో ఉగ్రవాదుల ఉనికి, చొరబాటుకు వారి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పాకిస్తాన్ నిరాశ మరియు నిస్పృహతో ఉంది, దీని కారణంగా చొరబాటు నిరోధక గ్రిడ్ ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు చొరబడి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపడానికి ప్రయత్నిస్తున్నారు. భారత సైన్యం చాలా అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి గత 72 గంటల్లో ఉగ్రవాదులు మూడు సార్లు విఫలయత్నం చేశారని తెలిపారు.