సెలవుల్లో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్‌ను కొందరు దుండగులు అడ్డుకున్నారు. అతని నుంచి దోపిడీ చేసే ప్రయత్నం చేయగా ఆయన అడ్డుకున్నాడు. దీంతో వారు అతనిపై కాల్పులు జరిపారు. జవాన్ బుల్లెట్ గాయాలతో ప్రాణం విడిచాడు. 

పాట్నా: బైక్ పై ఆర్మీ జవాన్ తన సోదరుడితో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లుతున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై వచ్చి వీరిని ఓవర్ టేక్ చేశారు. ఆ తర్వాత జవాన్ బైక్‌ను అడ్డుకున్నారు. ఆ జవాన్, ఆయన సోదరుడి నుంచి దోపిడీ చేయడానికి ఆ దుండగులు ప్రయత్నించారు. ఈ చోరీని జవాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంతే.. ఓ దుండగుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో జవాన్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. రాఘోపూర్‌ టౌన్ సమీపంలోని చాంద్‌పురా గ్రామానికి చెందిన బబ్లు కుమార్ ఆర్మీ చేరాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో పోస్టింగ్ వచ్చింది. అయితే, ఆయన సెలవులపై ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి ఆయన పాటలీపుత్ర రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు.

కంకర్‌బాగ్ ఏరియాకు చేరిన తర్వాత దుండుగులు వీరిని అడ్డుకున్నారు. తొలుత జవాన్ బబ్లు కుమార్ పై దాడి చేశారు. ఆ తర్వాత బబ్లు కుమార్ సోదరుడి పైనా కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన తృటిలో తప్పించుకున్నారు.

ఈ కేసును కంకర్‌బాగ్ ఎస్‌హెచ్‌వో రవి శంకర్ సింగ్ దర్యాప్తు చేస్తున్నారు.