గుజరాత్ లో కుప్పకూలిన వైమానిక దళ విమానం : పైలట్ మృతి
పొలంలో పశువులపై కుప్పకూలడంతో అవి కూడా మృతిచెందాయి.
భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ద విమానం గుజరాత్ లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ మృతి చెందాడు. ట్రైనింగ్ లో భాగంగా బయలుదేరిన ఈ విమానం సాంకేతిక కారణాల వల్ల కుప్పకూలి ఉంటుందని అధికారులు తెలిపారు.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన ఓ తేలికపాటి యుద్ధ విమానం గుజరాత్ కచ్ జిల్లాలో కూలిపోయింది. రోజువారీ ట్రైనింగ్లో భాగంగా జామ్నగర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో ఈ జాగ్వార్ విమానం కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఎయిర్ క్రాప్ట్ కూలిపోతూ శకలాలు పొలాల్లో పశువులపై పడ్డాయి. దీంతో కొన్ని పశువులు కూడా మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు.