రాజస్తాన్లో మరో దళిత బాలుడిపై టీచర్ దాడి.. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్
రాజస్తాన్లో ఓ చిన్నారి కుండలో నీళ్లు తాగాడని చితకబాదిన ఘటన మరువక ముందే మరో ఘటన అలాంటిదే చోటుచేసుకుంది. ఓ దళిత బాలుడిని టీచర్ కొట్టిన ఘటన బర్మార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది.
జైపూర్: రాజస్తాన్లో ఓ దళిత బాలుడిపై జరిగిన దాష్టీకాన్ని మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన కూడా రాజస్తాన్లోనే జరగడం గమనార్హం. ఓ స్కూల్లో దళిత బాలుడిపై విద్యార్థి దాడి చేశాడు. ఏడో తరగతి చదువుతున్న ఆ చిన్నారిని టీచర్ కొట్టాడు. గోడకేసి గుద్దినట్టూ బాధిత బాలుడి సోదరుడు చెప్పాడు. రాజస్తాన్లోని బర్మార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బర్మార్లోని స్కూల్లో విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఆ టెస్టుకు హాజరైన దళిత విద్యార్థి ఓ ప్రశ్నకు సమాధానం రాయలేదు. దీంతో ఆ విద్యార్థిని టీచర్ చితకబాదినట్టు అదే తరగతిలో చదువుతున్న బాధిత విద్యార్థి సోదరుడు చెప్పాడు. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాలతోనే సదరు విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థి అప్పటికే స్పృహ కోల్పోయాడు.
తల్లిదండ్రులు వెంటనే ఆ బాలుడిని హాస్పిటల్కు తరలించారు. టీచర్ అశోక్ మాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై ప్రశ్నిస్తున్నారు.
టీచర్ అశోక్ మాలి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడాడు. విద్యార్థులకు తాము టెస్టు పెట్టామని, ఆ సమయంలో ఓ విద్యార్థి తన దగ్గరకు ఉరికి వచ్చాడని, తన సోదరుడిని కొందరు కొట్టారని తనకు చెప్పాడని వివరించాడు. తనను ఆ విద్యార్థి వెంట తీసుకెళ్లాడని చెప్పాడు. గాయపడిన విద్యార్థిని వెంట తీసుకుని వచ్చి, నీరు, ఆహారం అందించానని తెలిపాడు. తన సోదరుడు కూడా ఓ టాబ్లెట్ తెస్తే తాను ఇచ్చానని వివరించాడు. ఆ మెడిసిన్ గురించి పిల్లాడిని అడుగుతూనే వారి ఇంటికి ఫోన్ చేస్తే వారు లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. ఆ తర్వాత బాలుడు తన సోదరుడితో కలిసి వెళ్లిపోయాడని వివరించాడు.
ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యుడు దిలీప్ చౌదరి వివరించారు.