కశ్మీర్ పాలకుడు హరిసింగ్ జయంతికి సెలవు ప్రకటించాలి: తనయుడి డిమాండ్
జమ్ము కశ్మీర్ పాలకుడు హరిసింగ్ పుట్టిన రోజును పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని ఆయన తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్.. జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు. జమ్ములో కొన్ని రోజులుగా యువత ముఖ్యంగా రాజ్పుత్ కమ్యూనిటీ ఈ డిమాండ్తో నిరసనలు చేస్తున్నదని వివరించారు.
సెప్టెంబర్: కాంగ్రెస్ సీనియర్ లీడర్, జమ్ము కశ్మీర్ గత రాజవంశానికి చెందిన కరణ్ సింగ్ కీలక డిమాండ్ చేశారు. తన తండ్రి మహారాజా హరి సింగ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 23న పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు. కరణ్ సింగ్ రాజ్యసభ మాజీ ఎంపీ, రాజా హరి సింగ్ కుమారుడు, చివరి జమ్ము కశ్మీర్ పాలకుడు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు.
కశ్మీర్లో స్థానికులు ముఖ్యంగా రాజ్పుత్ కమ్యూనిటీకి చెందినవారు గత పక్షం రోజులుగా జమ్ము నగరంలో నిరసనలు చేస్తున్నారని వివరించారు. చివరి మహారాజు హరి సింగ్ జయంతి రోజు సెప్టెంబర్ 23వ తేదీని పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. జమ్ము యువత చేస్తున్న ఈ డిమాండ్ను కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించాలని కోరారు. ఈ అంశమై చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయని, దీనికి తాను కూడా బలంగా మద్దతు తెలుపుతున్నట్టు వివరించారు.
ఈ ఆందోళన మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నదని తనకు అర్థం అవుతున్నదని తెలిపారు. కాబట్టి, యూటీ ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను కేవలం జమ్ము యువతది అని మాత్రమే కాదు.. ప్రజలందరిగా భావించాలని సూచించారు.
ఈ ఆందోళనలు కొనసాగితే ప్రజల రోజువారీ జీవితాలకు ఆటంకం కలుగుతుందని, సరిహద్దు ప్రాంతమైన సున్నితమైన రీజియన్ జమ్ముకు శ్రేయస్కరం కాదని వివరించారు. ఈ అంశమై తన అభిప్రాయాలను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలిపానని వివరించారు.