రూమ్మేట్ను ఐరన్ బాక్స్తో కాల్చి, గాయాలపై కారం చల్లిన విద్యార్థిని.. వారిద్దరు ఏపీకి చెందినవారే..
కేరళలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థినిల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అయిన మరో విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడింది.
తిరువనంతపురం: కేరళలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు విద్యార్థినిల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అయిన మరో విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థినికి కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలైన విద్యార్థినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థినిలు లోహిత, దీప తిరువనంతపురం జిల్లాలోని అగ్రికల్చర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరు హాస్టల్లో రెండేళ్లకు పైగా రూమ్మేట్స్గా కూడా ఉన్నారు.
ఇద్దరు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే ఈ నెల 18న లోహిత మరో విద్యార్థి సహాయంతో దీపపై ఐరన్ బాక్స్తో దాడి చేసింది. వేడిగా ఉన్న ఐరన్ బాక్స్తో దీప చేతిని కాల్చింది. ఆ తర్వాత దీప గాయాలపై కారంపొడి చల్లి.. మళ్లీ ఆమె చేతిని కాల్చింది. ఓ విషయంలో చెలరేగిన గొడవతో ఈ పరిణామం చోటుచేసుకుందని చెబుతున్నారు. అయితే లోహిత తనపై చేసిన దాడి గురించి దీప కళాశాల అధికారులకు ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. ఈ సంఘటన తరువాత దీప మరుసటి రోజు ఆంధ్ర ప్రదేశ్లోని తన స్వగ్రామానికి బయలుదేరింది.
అయితే దీప శరీరంపై వెనక భాగంలో ఉన్న బలమైన కాలిన గాయాల గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. తిరువనంతపురం చేరుకుని కళాశాలలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అధికారులు సమస్యను పరిశీలించడానికి నలుగురు సభ్యుల కమిటీని నియమించారు. కాలేజీ యాజమాన్యం తిరువల్లం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.
అయితే దీపపై లోహిత దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని కళాశాల డీన్ తెలిపారు. లోహితను పోలీసులు విచారించిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు లభిస్తాయని అన్నారు. ‘‘మేము ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినితో మాట్లాడినప్పుడు.. ఆమె ఏమీ చేయలేదని చెప్పింది. ఈ సంఘటనకు దారితీసిన నిర్దిష్ట కారణాలను మేము ఇంకా కనుగొనలేదు’’ అని తెలిపారు. ఈ సంఘటన కుల ఆధారిత హింసకు సంబంధించినది కాదని, అలాగే రాజకీయ విభేదాలకు సంబంధించినది కాదని పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు లోహితపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.