కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆనంద్ మహీంద్రా రిక్వెస్ట్.. దేని గురించి అంటే?
ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ రోడ్డు వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో రోడ్డుకు ఇరు వైపులా చెట్లు దట్టంగా ఉన్నాయి. ఇలాంటి రోడ్లు నిర్మించాలని ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రిక్వెస్ట్ పెట్టారు.
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఏ ట్వీట్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆయన ఇచ్చే క్యాప్షన్లు, కంటెంట్ చాలా మంది నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. ఆయన ట్వీట్ కోసం ప్రత్యేకంగా ఎదురుచూసే వాళ్లే ఉంటారంటే అతిశయోక్తి కాదు. తాజాగా, ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవ్వడమే కాదు.. ఆయన అందులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటో ఓ సారి చూద్దాం.
ఈ నెల 27న ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్వీట్ చేశారు. రోడ్డుకు ఇరు వైపులా చెట్లు దట్టంగా ఉన్న ఓ ప్రదేశాన్ని ఆయన ట్వీట్ చేశారు. రోడ్డు చుట్టూ ఆ చెట్లు ఆవరించి ఒక సొరంగాన్ని సూచిస్తున్నాయి. దట్టమైన చెట్లతో ఆ రోడ్డు సోరంగం లాగే కనిపిస్తున్నది. ఆ సొరంగం గుండా ప్రయాణిస్తున్న ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు.
సొరంగాన్ని ఆంగ్లంలో టన్నెల్ అంటారు. అయితే.. ఈ సొరంగం చెట్లతో ఏర్పడిన కారణంగా ఆనంద్ మహీంద్రా ఈ టన్నెల్కు ట్రన్నెల్ అని పేరు పెట్టాడు. ఇందులో టన్నెల్తోపాట ట్రీ కూడా కలిపేశాడు. తనకు టన్నెల్స్ అంటే చాల ఇష్టం అని, కానీ, ఇలాంటి ట్రన్నెల్ గుండా వెళ్లడం మరెంతో ఇష్టం అని వివరించారు. అదే విధంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశాడు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లకు ఇరు వైపులా ఇలాగే మొక్కలు నాటితే బాగుంటుందని ఆయన పేర్కొన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్గా మారింది. ఇప్పటికీ ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. అలాగే, చాలా మంది యూజర్లు కామెంట్లు పెట్టారు. ప్రపంచంలోనే ఈ సొరంగం సహజమైనదని వివరించారు. కొల్హపూర్ నుంచి కొంకన్కు వెళ్లే దారిలోనూ రధనగిరి అటవీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఫీలింగే వస్తుందని ఓ యూజర్ తన అనుభవాన్ని తెలిపారు.