108 రోజుల తరువాత డిశ్చార్జ్ అయిన డాక్టర్ అన్హిత పండోల్.. ఇంతకీ ఆమె ఎవరు?
గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోల్ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయబడింది, ఈ కారణంగా సైరస్ మిస్త్రీ ప్రమాదంలో మరణించాడు.
టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ అనహిత పండోలే గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో డాక్టర్ అనహిత పండోలే కారు నడుపుతున్నారు.ఆమె భర్త డారియస్ పండోల్ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందడం గమనార్హం. ఆయన అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అందిన సమాచారం ప్రకారం, డాక్టర్ అనహిత పండోల్ 108 రోజుల తర్వాత సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె, ఆమె భర్త డారియస్ పండోల్ ఇద్దరూ సెప్టెంబర్ 5న ఆసుపత్రిలో చేరారు.
అనహిత పండోలే ఎవరు?
ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీతో కలిసి తన కారులో ప్రయాణించింది. వాస్తవానికి ఆమెనే ఆ కారును నడిపింది. అనహిత ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. అంతే కాకుండా.. ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తుంది. ఆమెకు గైనకాలజిస్ట్గా 18 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. అనహిత పండోల్ TNMC & BYL నాయర్ హాస్పిటల్ నుండి MBBS, MD పూర్తి చేసింది. ఆమె భర్త పేరు డారియస్ పండోల్.. ఆయన జీఎం ఫైనాన్షియల్ సీఈఓ(CEO).
ప్రమాదం ఎలా జరిగింది?
సెప్టెంబర్ 4న కారు ప్రమాదం జరిగింది. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని కాసా పోలీస్ స్టేషన్ పరిధిలోని చరోతి నాకా వద్ద సూర్య నది వంతెనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో గైనకాలజిస్ట్ అనహిత పండోలే కారు నడుపుతున్నారు. మిస్త్రీ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు.. జహంగీర్ పండోల్ కూడా ప్రాణాలు కోల్పోయారు.అతను డారియస్ సోదరుడు.
అనహిత (55), ఆమె భర్త డారియస్ పండోల్ (60) తీవ్రంగా గాయపడ్డారు. డారియస్ పండోల్కు మోచేతి శస్త్రచికిత్స జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ పోలీసులు సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో డాక్టర్ పండోల్పై ర్యాష్ , నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. ఆ కారు ముందు పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. పాల్ఘర్ పోలీసులు డాక్టర్ అనహితపై నవంబర్లో కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 304ఎ, 279, 337 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద అనాహితపై కాసా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీ
2011లో రతన్ టాటా వారసుడిగా మిస్త్రీ ఎంపికయ్యారు. అంతకుముందు కూడా అతను ప్రముఖ వ్యాపార సమ్మేళనం షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నాడు. 1968 జూలై 4న ముంబైలో జన్మించిన సైరస్ తండ్రి పల్లోంజీ మిస్త్రీ కూడా వ్యాపారవేత్త.