అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యునికి.. ఇది షాక్ అనే చెప్పాలి.

అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యునికి.. ఇది షాక్ అనే చెప్పాలి. అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్.. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచినట్టుగా వెల్లడించింది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాలలో పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొంది. తాజా పెంపుతో ఫుల్ క్రీమ్ పాల ధర లీటరుకు రూ. 61 నుంచి రూ. 63కి పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘‘ పాల ఉత్పత్తి వ్యయం, మొత్తం నిర్వహణ వ్యయంపెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు జరిగింది. గత సంవత్సరంతో పోల్చితే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతం పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే.. మా సభ్య సంఘాలు కూడా గత ఏడాది కంటే రైతులకు ఇచ్చే ధరలను 8-9 శాతం శ్రేణిలో పెంచాయి’’ అని అమూల్ సంస్థ పేర్కొంది. 

ఇక, అంతకు ముందు ఆగస్ట్‌లో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిందని పేర్కొంటూ అమూల్ సంస్థ.. లీటరు పాల ధరలను రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది అమూల్ సంస్థ పాల ధరలను పెంచడం ఇది మూడోసారి.