Amravati Chemist Killing: అమరావతి కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్.. రంగంలోకి ఎన్ ఐఏ
Amravati Chemist Killing:బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ మద్దతుగా వ్యాఖ్యాలు చేసిన మహారాష్ట్ర అమరావతికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.
Amravati Chemist Killing: బీజేపీ బహిష్కృత అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. అనేక చోట్ల నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన ఓ టైలర్ .. నూపుర్ శర్మకు మద్దతుగా.. వ్యాఖ్యలు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీని తరువాత అతడు దారుణ హత్య కు గురయ్యాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే.. ఈ ఘటన మరకముందే.. ఇలాంటి ఘటననే మరోకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన మహారాష్ట్ర అమరావతికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇర్ఫాన్ ఖాన్ ను నాగ్పూర్లో అరెస్టు చేశారు. ఇర్ఫాన్ ఖాన్ .. అమరావతిలో రెహబర్ అనే ఎన్జీవోను నడుపుతున్నట్లు గుర్తించారు.
వివరాల్లోకెళ్తే.. అమరావతిలో వెటర్నరీ ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే . ఆయన గత నెలలో నూపుర్ శర్మకు అనుకూలంగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అలాగే.. ఆయన అనుకోకుండా ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేసినట్టు కొత్వాలి పోలీసు స్టేషన్కు చెందిన ఓ అధికారి తెలిపారు.
ఈ క్రమంలో జూన్ 21ను రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హే తన దుకాణం మూసేసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో.. ఇర్ఫాన్ ఖాన్ గ్యాంగ్ అదును చూసి.. ఉమేష్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇర్ఫాన్ సూచన మేరకు గతంలో అరెస్టయిన ఆరుగురు నిందితులు కలిసి ఈ హత్య చేశారు. ఇర్ఫాన్ ఆదేశం తర్వాత, ఆ ఆరుగురు నిందితులు ఏమీ ఆలోచించకుండా ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్యలో మొత్తం ఏడుగురు నిందితులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.
వారిపై IPC సెక్షన్ 302, 120B, 109 కింద కేసు నమోదు చేశారు. నూపూర్ శర్మకు మద్దతుగా అతను (ఉమేష్ కోల్హే) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ హంతకులు కూడా ఉదయ్పూర్లో చేసిన టైలర్ కన్హయ్యాలాల్ మాదిరిగానే హత్యకు పాల్పడ్డారా? అని కూడా ATS పరిశీలిస్తోంది. అరెస్ట్ చేసిన నిందితుల పేర్లను పోలీసులు బయటపెట్టారు. ఇప్పుడు ఇందులో ఏడో పేరు కూడా చేరిపోయింది.
1. ఇర్ఫాన్ ఖాన్- హత్యకు సూత్రధారి
2. ముదాసిర్ అహ్మద్ అలియాస్ సోను రాజా షకీబ్రహీం
3. షారుఖ్ పఠాన్ అకా బాద్షా హిదాయత్ ఖాన్
4. అబ్దుల్ తౌఫిక్ అలియాస్ నాను షేక్ తస్లీమ్
5. షోహెబ్ ఖాన్ అకా బురియా సబీర్ ఖాన్
6. అతిప్ రషీద్ ఆదిల్ రషీఫ్
7. డాక్టర్ యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్
అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు కోసం మహారాష్ట్రలోని అమరావతికి వెళుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.