కౌన్ బనేగా కరోడ్ పతి లో డబ్బు గెలిచి.. చిక్కుల్లో పడ్డ ప్రభుత్వ ఉద్యోగి
కేబీసీ షోలో పాల్గొనడానికై రాజస్థాన్లో కోటా నుంచి దేశ్ పాండే ముంబైకి వచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు ఆయన ముంబైలో ఉన్నారు. షోలో పాల్గొనేందుకు దేశ్ పాండే తన ఉన్నతధికారుల వద్ద సెలవుల కోసం అప్లికేషన్ పెట్టాడు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాల్టీ షో... కౌన్ బనేగా కరోడ్ పతి. ఈ షో దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ షోలో పాల్గొని డబ్బులు గెలవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని డబ్బులు గెలవాలని ఆశపడ్డాడు. అయితే.. ఆ కార్యక్రమంలో పాల్గొని తన కల నెరవేర్చుకున్నా.. అతను చిక్కుల్లో పడటం గమనార్హం.
కంటెస్టెంట్ దేశ్ బంధ్ పాండే కేబీసీలో పాల్గొని.. బిగ్ బీ అడిగిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.3,40,000 గెలుచుకొని ఇంటి ముఖం పట్టాడు. కేబీసీలో పాల్గొని అమితాబ్ బచ్చన్ను కలవాలన్న తన కలను దేశ్ పాండే నెరవేర్చుకున్నారు. దేశ్ పాండే వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి.
అయితే తాను పని చేస్తున్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ అతనికి షాక్ ఇచ్చింది. కేబీసీలో పాల్గొన్నందుకు ఆయనకి చార్జ్షీట్ పంపించింది. కేబీసీ షోలో పాల్గొనడానికై రాజస్థాన్లో కోటా నుంచి దేశ్ పాండే ముంబైకి వచ్చారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 13 వరకు ఆయన ముంబైలో ఉన్నారు. షోలో పాల్గొనేందుకు దేశ్ పాండే తన ఉన్నతధికారుల వద్ద సెలవుల కోసం అప్లికేషన్ పెట్టాడు.
అయితే ఉన్నతధికారులు ఆయన సెలవుల అప్లికేషన్ను పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం ఆయన కేబీసీ షోలో పాల్గొన్నారు. దీంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆయనకు చార్జ్ షిట్ను పంపించింది. అయితే విషయంపై రైల్వే ఉద్యోగులు.. అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.
పశ్చిమ మధ్య రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రటరీ ఖలీద్ ఈ విషయంపై స్పందిస్తూ.. దేశ్ పాండేపై రైల్వే అడ్మినిస్ట్రెషన్ ఎప్పుడూ సరిగా వ్యవహరించలేదన్నారు. ఆయన బిహార్లోని పట్నాలో పుట్టి పెరిగారని, రైల్వేలో ఆయన ఆఫీస్ సూపరింటెండెంట్ అని తెలిపారు. ఉద్యోగం కోసం దేశ్ పాండే గత 13 ఏళ్ల నుంచి రాజస్థాన్లోని కోటాలో ఉంటున్నారని పేర్కొన్నారు.