ఇక అమెజాన్ లో మద్యం హోమ్ డెలివరీ!
అమెజాన్ తో పాటుగా బిగ్ బాస్కెట్ కి కూడా ఆన్ లైన్ లో మద్యాన్ని డెలివరీ చేసే అనుమతులు లభించాయి.
మద్యం కూడా ఇక ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. దానికి మళ్లీ ఏదో కొత్త యాప్ కావాలని అనుకోకండి. మీరు రెగ్యులర్ గా ఆర్డర్ చేసుకునే అమెజాన్ సంస్థే ఇక మద్యాన్ని కూడా ఆన్ లైన్ లో డెలివరీ చేయనుంది. మద్యం కోసం షాపుల ముందు చాంతాడంత క్యూ లైన్లు, కరోనా వ్యాపిస్తుందన్న భయం అన్నిటికి ఇక ఒక నమస్తే పెట్టేయొచ్చు.
అమెజాన్ తో పాటుగా బిగ్ బాస్కెట్ కి కూడా ఆమోదం లభించినట్టు తెలియవస్తుంది. కాకపోతే... ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఎప్పటి నుండో మద్యం హోమ్ డెలివరీ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న అమెజాన్ ఎట్టకేలకు సాధించింది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో పెట్టుబడులను పెడుతూ... మార్కెట్ ను విపరీతంగా విస్తరిస్తుంది అమెజాన్. ఇప్పటికే లాక్ డౌన్ కాలంలో కొన్ని నగరాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్య్, జొమాటోలు చేసాయి కూడా. ఇప్పుడు తాజాగా అమెజాన్ లైసెన్స్ దక్కించుకోవడం విశేషం.
ఇకపోతే... ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో తన మార్కెట్ విస్తరించడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ రంగంలో భారీగా మార్కెట్ ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అమెజాన్ లాభాల పంట పండినట్లేనని భావిస్తున్నారు.
అందుకే అమెజాన్ ఇక్కడ వివిధ రూపాల్లో 650 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అలెక్సా పేరుతో వాయిస్ యాక్టివేటెడ్ ఇంటరాక్టివ్ స్పీకర్లు, అమెజాన్ ప్రైమ్ పేరుతో వీడియో స్ట్రీమింగ్, మొబైల్ వ్యాలెట్, క్లౌడ్ సేవలు సైతం అమెజాన్ అందిస్తోంది.
ఈ నేపథ్యంలో 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్లో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు టెలికాం రంగ ప్రవేశ ప్రయత్నాలూ అమెజాన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎయిర్ టెల్లో అమెజాన్ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ మార్కెట్ పరంగా ఎయిర్ టెల్లో 5శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రెండు సంస్థలు స్పందించేందుకు నిరాకరించినా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం.
మనదేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 300మిలియన్లకు పైగా వినియోగదారులతో మూడో స్థానంలో ఉన్న అతిపెద్ద టెలికాం సంస్థగా చెలామణి అవుతున్న ఎయిర్ టెల్లో అమెజాన్ వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆ ఆంగ్ల దినపత్రిక కథనం తెలిపింది.
దీని ప్రకారం అమెజాన్-ఎయిర్ టెల్ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రణాళిక బద్ధమైన పెట్టుబడులపై చర్చలు పూర్తయితే అమెజాన్, ఎయిర్ టెల్లో 5శాతం వాటాను కొనుగోలు చేయడం ఖాయమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్టెల్కు 30 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో నంబర్ వన్ టెలికాం కంపెనీగా ఉన్న ఎయిర్టెల్కు.. రిలయన్స్ జియో ఎంట్రీతో కష్టాలు మరింత పెరిగాయి. క్రమంగా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది.